Southwest Monsoon Enters into Telangana : నిన్న ఏపీలోని రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు.. నేడు తెలంగాణను కూడా తాకాయి. గద్వాల్, నాగర్ కర్నాల్, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. తొలకరి పలకరింపుతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రాష్ట్రానికి జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు వస్తాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే వస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్ 6వ తేదీ నాటికి రుతుపవనాలు వస్తాయని అంచనా వేయగా.. మూడ్రోజులు ముందే రాష్ట్రంలోకి నైరుతి వచ్చేసింది.
నైరుతి ముందుగానే రాష్ట్రంలోకి రావడంతో.. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు రాష్ర్టంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అంచనా పేర్కొంది.
Also Read : ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
ఏపీని నైరుతి తాకడంతో.. రాష్ట్రమంతా ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. మండుటెండలకు అల్లాడిపోయిన ప్రజలు తొలకరి పలకరింపుతో సేదతీరారు. రైతన్నలు పంటల పనులు మొదలుపెట్టవచ్చన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లిలో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నంద్యాల జిల్లా పాణ్యంలో 11.9 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 11.4 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, జూన్ 5వ తేదీ నుంచి విస్తారమైన వర్షాలు పడొచ్చని రాష్ట్ర వాతావరణశాఖ అంచనా వేసింది.