Vizianagaram Political Parties Worried About Cross Voting: విజయనగరం జిల్లాలో అభ్యర్ధులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న సమాచారంతో.. ఓటు ఎవరికో? పోటు ఎవరికో? అంతుపట్టక అధికారపక్ష అభ్యర్ధులు తెగ హైరానా పడిపోతున్నారు. ఉన్న ఏడు అసెంబ్లీలో ఎక్కువ చోట్ల ఎమ్మెల్యే అభ్యర్ధులు అనుచరులు నగదు పంపిణీ సమయంలో.. ఎమ్మెల్యే ఓటు మా నాయకుడికి వేయండి.. ఎంపీ ఓటు మీ ఇష్టం అని చెప్పారంట. దాంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్ల ఈవీఎంలపై కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ గుర్తు క్రమ సంఖ్య వేర్వేరుగా వచ్చింది. ఈ అంశాల్ని ఆలస్యంగా తెలుసుకున్న పోటీదారులు తెగ టెన్షన్ పడిపోతున్నారంట.
ఓట్ల లెక్కింపు సమీపిస్తున్న కొద్దీ విజయనగరం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్ధులకు టెన్షన్ పెరిగిపోతుంది. రోజుకో కొత్త సందేహాం పుట్టుకొస్తూ వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఓవరాల్ పోలింగు సరళిని మదింపు చేసి మండలాలు, గ్రామాలు, పోలింగు బూత్ల వారీగా ఎక్కడ ఎంత మెజారిటీ రావొచ్చు, ఎక్కడ ఎంత తగ్గొచ్చు వంటి కూడికలు, తీసివేతలతో కొద్దిరోజుల పాటు బిజీగా గడిపారు. కేండెట్లు కౌంటింగ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఆ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన తరుణంలో పార్టీలు, అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ కలవరపరుస్తోంది. విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది.
టీడీపీ విషయానికొస్తే.. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని నెల్లిమర్ల మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆపార్టీ అభ్యర్థులే పోటీలో ఉన్నారు. విజయనగరం ఎంపీ స్థానానికీ టీడీపీ అభ్యర్దే బరిలో ఉన్నారు. నియోజకవర్గాలవారీగా తెలుగు,ఇంగ్లీష్ అక్షరక్రమంలో ఈవీఎంల బ్యాలెట్లపై అభ్యర్థుల పేర్లు, వాటి ఎదురుగా వారికి కేటాయించిన గుర్తులు ఉంటాయి. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసు కుంటారు. ఎప్పుడూ ఇది సహజ ప్రక్రియే.. అయితే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఒకే క్రమసంఖ్య రెండు ఈవీఎంల్లో ఉంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కానీ, ఈసారి కొన్నిచోట్ల ఒకలా, మిగిలిన చోట్ల మరోలా ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టుకొస్తోంది.
Also Read: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై.. వైసీపీ నేతల్లో భయం
క్రమసంఖ్య ఆధారంగా ఓట్లు వేసే ఓటర్ల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ గ్రామస్థాయి నేతలు కూడా గుర్తుతో పాటు సీరియల్ నెంబరుకూడా ఒకటికి రెండుసార్లు చెబుతుంటారు. కానీ, మొత్తం ఏడు సెగ్మెంట్లలో కొన్నిచోట్ల సీరియల్ నంబర్లలో తేడాలు వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక సీరియల్ నంబర్ వస్తే, ఎంపీ అభ్యర్థికి మరో సీరియల్ నంబర్ వచ్చింది. ఇక్కడే ఓటర్లు కాస్త గజిబిజికి గురయ్యారని పార్టీలు, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు, ఎంపీ ఓటు విషయానికి వచ్చేసరికి కన్ఫ్యూజన్లో వేరే పార్టీకి వేసినట్టు అభ్యర్థులు ఆలస్యంగా గుర్తించి కలవరపడుతున్నారు. ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారం ఎవరి కొంప ముంచు తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి బెల్లానల ఈ ఇద్దరి సీరియల్ నంబర్లు మూడే అవడం విజయనగరంలో అదితి గజపతిరాజు , ఎంపి అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు సీరియల్ నంబర్లు ఒకటి అవడంతో ఆయా సెగ్మెంట్లలో పెద్దగా చిక్కులు లేవంటున్నారు
కానీ, అన్ని సెగ్మెంట్లలో అలా జరగలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ముందు వెనుకలు ఉంటాయి. అలాంటి చోట తప్పకుండా క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమంటే.. ఇలా సీరియల్ నంబర్లు ముందు వెనుక ఉన్న సెగ్మెంట్లలో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు అసెంబ్లీకి మాకు వేసి ఎంపీకి మీకు నచ్చిన వారికి వేసుకోమని చెప్పినట్టు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. అభ్యర్థుల మద్దతుదారులు ఆ మేరకు ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారన్న సిత్రాలు బయటపడుతున్నాయి.
వైసీపీలో ఇలా ఎక్కువ శాతం జరిగినట్టు ప్రచారంలో ఉంది. ఓటుకు నోటు పంపిణీ సమయంలో వైసీపీ నేతలు ఎంపీ ఓటు మీ ఇష్టం.. ఎమ్మెల్యే ఓటు మాత్రం మాకే వేయండి అని చెప్పుకున్నట్లు తాజాగా బయటపడడం అభ్యర్ధుల్లో కలకలం రేపుతోంది. మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్. అదేంటంటే.. డబ్బులు తీసుకోకపోతే అనుమానిస్తారనే ఉద్దేశంతో రెండుపార్టీల వద్ద అమౌంట్ అందుకున్న తటస్థులు రెండు ఓట్లలో ఒకటి ఎమ్మెల్యేకు, మరోటి ఎంపీకి వేసి.. తీసుకున్న సొమ్ముకు న్యాయం చేసినట్టు ప్రచారం సాగుతోంది.
Also Read: ’ఎగ్జిట్‘ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన బెట్టింగ్ బాబుల హడావుడి
మొత్తమ్మీద, క్రాస్ ఓటింగ్ జరిగిందని రెండు పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఓటు ఎవరికి.. పోటు ఎవరికి అనేది అంతుబట్టక రెండు పార్టీల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. ఇంకోవైపు, ఎమ్మెల్యే ఓటు మాత్రం మాకే అన్న నినాదం కొన్నిచోట్ల బెడిసికొట్టినట్టు తెలుస్తుంది. ఇలా చెప్పినవారికి బుద్ధి చెప్పేందుకా అన్నట్టు రివర్స్లో ఓటు వేసినట్టు కూడా పొలిటికల్ గ్రౌండ్లో టాపిక్ నడుస్తోంది. మొత్తమ్మీద, కౌంటింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఇటువంటి సిత్రాలు ఇంకెన్ని వినాల్సి వస్తుందోనని పార్టీలు, అభ్యర్థులు కలవరపడుతున్నారు.