Massive Jump In Stock Market: దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం అతి భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మరో సారి అధికారం చేపడుతోందని తేలడంతో మార్కెట్ సూచీలు ఒక్కసారిగా లాభాల్లో దూసుకెళ్లాయి. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో దూసుకెళ్లడం విశేషం. ఉదయం 10.20 గంటలకు సెన్సెక్స్ 2,118.84 పాయింట్ల లాభంతో 76,080.15 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికొస్తే.. 665.60 పాయింట్లు లాభపడి 23,196.30 వద్ద కొనసాగుతోంది. గత కొంతకాలంగా నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో అమాంతం పెరిగాయి.
Also Read: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ.. రెండవ స్థానంలో అంబానీ
మోదీ 3.0.. కారణమిదేనా?
ఎగ్జిట్ పోల్స్లో దేశమంతా మోదీ వేవ్ కొనసాగిందని తేలింది. ఓటర్లంతా ముచ్చటగా మూడోసారి మోదీకి బ్రహ్మరథం పట్టినట్లు ఫలితాలను చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఒకవేళ మళ్లీ మోదీ అధికారం చేపడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు తయారీ రంగంలో పెట్టుబడులు కొనసాగే అవకాశం ఉండనుందని అందరికీ బలమైన నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంది. అందుకే నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కటి 4 నుంచి 5శాతం వరకు పెరుగుదల కనిపించింది. బీఎస్ఈలో ఏకంగా అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11 లక్షల కోట్లకు పైగా ఎగబాకింది. దీంతోపాటు పీఎస్యూ బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, రియాల్టీ, ఆటో వంటి కీలక రంగాలు 3 నుంచి 5 శాతం వరకు లాభపడ్డాయి.
Also Read: బెస్ట్ ఆఫర్.. హోండా ఎలివేట్పై వేలల్లో డిస్కౌంట్!
మార్కెట్ సూచీలపై ఎగ్జిట్ పోల్స్ ప్రభావం
గడిచిన రెండు వారాలుగా స్టాక్ మార్కెట్లు ఒడిదొడుగుల్లో అనిశ్చితి కొనసాగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఇక్కసారిగా ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 370కిపైగా సీట్లు సాధిస్తుందని వెల్లడైంది. దీంతో ఇన్వెస్టర్లు ఓ అంచానికి వచ్చేశారు. రానున్న రోజుల్లో దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా స్థాపించడానికి మోదీ వెనకాడరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల చైనా, టెస్లా వంటి విదేశీ కంపెనీలు చైనాను దాటి తమ ఉత్పత్తిని విస్తరించేందుకు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు జీడీపీ అంచనాలు మించి 8.2శాతం వృద్ధి సాధించింది.
Also Read: కియా దూకుడు.. గత నెలలో సేల్స్లో దుమ్ము రేపిన కార్లు.. ఎక్కువగా ఏ మోడల్స్ అంటే?
ఎవరెవరు ఏమన్నారంటే?
మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (పరిశోధన) ప్రశాంత్ తాప్సే స్పందించారు. జూన్లో దలాల్ స్ట్రీట్ బలమైన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు గణనీయమైన విజయాన్ని అందిస్తుందని సూచించారు. అలాగే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని సూచిస్తున్నాయని, మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపిందని రెలిగేర్ బ్రోకింగ్లోని రిటైల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత మార్కెట్ అనిశ్చితి అస్థిరతకు దారితీయవచ్చని, పెట్టుబడిదారులు హెచ్చుతగ్గులకు సిద్ధంగా ఉండాలని సింగ్ సూచించారు.