AP Exit Polls Big Tension To Betting Batch: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్లో హడావుడి పెంచేశాయి. అత్యధిక సంస్థలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపడంతో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు గడువు దగ్గరపడటంతో వారి హడావుడి మరింత పెరిగిపోయింది. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారంట. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్నారు. అయితే ట్రెండ్ తెలియడంతో ప్రత్యర్థులు వెనకడుగు వేస్తున్నారంట. కొన్ని చోట్ల వైసీపీ కీలక నేతలపై కూడా బెట్టింగ్ కాసేందుకు చాలామంది వెనకాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. పోలింగ్ శాతం పెరగడంతో ముందు నుంచి పందెంరాయుళ్లు కూటమి విజయంపై కాయ్ రాజా కాయ్ అంటూ వచ్చారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో వారి దూకుడు మరింత పెరిగిపోయింది.. భీమవరం, కడప, నెల్లూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశాపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం వేసి నెగ్గితే.. వారికి ఒకటికి నాలుగు రెట్లు ఇచ్చేలా పందాలు నడుస్తున్నాయంట.
గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. చరిత్ర సృష్టించబోతున్నాం’ అంటూ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ పోలింగ్ ముగిసాక స్వయంగా ప్రకటించారు. పోలింగ్ తర్వాత మూడు రోజులకు ఐ ప్యాక్ కార్యాలయానికి వచ్చిన జగన్.. తనకు సలహాలిచ్చిన ఆ టీంతో సెల్ఫీలు దిగి.. 2019కి మించి చరిత్ర సృష్టించబోతున్నామని ఘనంగా ఇంగ్లీషులో ప్రకటించి లండన్ ఫ్లైట్ ఎక్కేసారు.
Also Read: ఏపీలో కౌంటింగ్కు కౌంట్డౌన్.. గెలిచేదెవరు? ఓడేదెవరు?
తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకష్ణారెడ్డి వంటి నేతలు రెండు అడుగులు ముందుకేసి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటనలు గుప్పించారు. విశాఖలో ఆయన ప్రమాణస్వీకారం జరుగుతుందని.. ఘనంగా ఏర్పాటు కూడా జరుగుతున్నట్లు వెల్లడించారు. బొత్స అయితే 170కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని జోస్యం చెప్పేశారు
వాస్తవానికి మొదట్లో వైసీపీకి 60 సీట్లొస్తాయంటూ పందేలు మొదలైతే.. జగన్ ప్రచారం ముగిసే సమయానికి ఆ సంఖ్య 75 వరకు వచ్చింది… పోలింగ్ తర్వాత అది మళ్లీ 70కి తగ్గిందంట. తాజాగా వైసీపీ 40 నుంచి 50 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందన్న దానిపై పందేలు నడుస్తుండడం గమనార్హం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఒక్క పార్టీకే 89-92 సీట్లు వస్తాయి. కూటమికి 104-107 సీట్లు వస్తాయంటూ పందేలు నడిచాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ ఫిగర్ 125- 135కు చేర్చి.. మరింత పెద్ద మొత్తాలతో పందెంరాయుళ్లు ముందుకు వస్తున్నారంట.
స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశాక కూడా వైసీపీ విజయంపై పందేలకు ఆ పార్టీ సానుభూతిపరులతో సహా, ఇతర పందెం రాయుళ్లు ఆసక్తి చూపలేదంటున్నారు. గతంలో కట్టిన పందేల డబ్బులను కొందరు వెనక్కి తీసుకుంటున్నారంట .. వాస్తవానికి కలిపిన పందెం డబ్బులు అలా తిరిగి ఇవ్వరు. అయితే 10 నుంచి 20 శాతం అమౌంట్ వదిలేసుకొని మరి వెనక్కి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో వైసీపీ నేతలు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు రికవర్ చేసుకోవడానికి ఫేక్ ఫీలర్లు వదులుతూ.. మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: గురువు వర్సెస్ శిష్యుడు.. ఎవరి బలమెంత?
బెట్టింగ్లు ఇల్లీగల్ అయినప్పటికీ.. ఈ సారి సంక్రాంతి కోడి పందేలకు మించి ఎలక్షన్ బెట్టింగులు జరుగుతున్నాయంట. ఒక్క భీమవరం కేంద్రంగా రూ.150 కోట్ల విలువైన బెట్టింగ్లు నడుస్తున్నా.. అక్కడ వైసీపీ గెలుస్తుందని పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంట. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గాలు, ప్రముఖులు పోటీలో ఉన్న స్థానాలు, వారి విజయావకాశాలు, మెజారిటీలపై బెట్టింగులు నడుస్తున్నాయి. ‘కడప లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయి? ఉండి స్థానంలో టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకు ఎంత మెజారిటీ వస్తుంది? మంగళగిరిలో లోకేష్ గెలుపు? పవన్ కళ్యాణ్ మెజార్టీ? .. ఇలా రకరకాలుగా పందాలు నడిచిపోతున్నాయి.
కూటమి విజయం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా బెట్టింగ్లు నడుస్తున్నాయంట. కూటమి వైపు మెజార్టీ సర్వే సంస్థలు మొగ్గు చూపడంతో ఒకటికిరెండు రూపాయలు ఇస్తామని చెబుతున్నారంట. అయినప్పటికీ కొందరు ముందుకు రావడం లేదట. పైపెచ్చు కూటమి విజయం, కూటమి ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందనే అంశాలపై పందాలు కాయడానికి వైసీపీ శ్రేణులు ఉత్సాహం చూపిస్తున్నాయంట.