West Indies vs Papua New Guinea Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో తొలిరోజు ఆతిథ్య దేశాలు విజయాలు సాధించి శుభారంభం చేశాయి. ఉదయం జరిగిన మ్యాచ్ లో యూఎస్ ఏ విజయం సాధిస్తే, రాత్రి జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ గెలిచింది.
పపువా న్యూగినియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య గయానాలో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగు తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి విజయం సాధించింది.
వివరాల్లోకి వెళితే… 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ గోల్డెన్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (34), నికోలస్ పూరన్ (27) కాసేపు మ్యాచ్ ని లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్లారు. కాకపోతే జిడ్డు బ్యాటింగుతో అందరి సహనాన్ని పరీక్షించారు. అయితే పిచ్ మీద బాల్ టర్న్ కావడంతో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైపోయింది.
ఒక రన్ తీయడానికి పడరాని పాట్లు పడ్డారు. ఒక దశలో మ్యాచ్ వెస్టిండీస్ నుంచి చేజారిపోయినట్టే అనిపించింది. ఆతిథ్య జట్టుకి తొలి మ్యాచ్ లోనే పరాభవం తప్పదా? అని అంతా అనుకున్నారు. ఎందుకంటే 14 ఓవర్లు గడిచేసరికి 4 వికెట్ల నష్టానికి 85 పరుగులతో మ్యాచ్ అంత నత్తనడకతో సాగింది. అప్పటికి ఇంకా 36 బాల్స్ ఉన్నాయి. 51 పరుగులు చేయాలి.
16 ఓవర్లు గడిచేసరికి 5 వికెట్ల నష్టానికి 97 పరుగులతో పడుతూ లేస్తూ వెళుతోంది. 24 బాల్స్ లో 39 పరుగులు చేయాలి. కెప్టెన్ రోవ్ మన్ పావెల్ (15), రూథర్ ఫర్డ్ (2) ఇద్దరూ త్వరగా అయిపోయారు. అప్పుడు రోస్టన్ ఛేజ్ 27 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాదు, జట్టుని ముందుండి గెలిపించాడు. తనకి ఆండ్రీ రసెల్ (15) సహకారం అందించాడు. 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 చేసి బతుకు జీవుడా అనుకున్నారు.
Also Read: న్యూయార్క్లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ
పపువా న్యూ గినియా బౌలింగులో అలీ నావో 1, ఛాద్ సోపర్ 1, జాన్ కరికో 1, అసద్ వాలా 2 వికెట్లు పడగొట్టారు.
అంతకముందు బ్యాటింగ్ ప్రారంభించిన పపువా న్యూ గినియా కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ టోనీ ఉరా (2) చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన లెగా సియాకా (1) బౌల్డ్ అయిపోయాడు. అలా 7 పరుగులకి 2 వికెట్లతో మొదలై 8.5 ఓవర్లు గడిచేసరికి 4 వికెట్ల నష్టానికి 50 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 15 ఓవర్లు గడిచేసరికి 6 వికెట్ల నష్టానికి 98 పరుగులతో పడుతూ లేస్తూ ముందుకు వెళ్లింది. మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
అయితే సెకండ్ డౌన్ వచ్చిన సెసే బావు 43 బాల్స్ లో 1 సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని హాఫ్ సెంచరీ ఒక్కటే జట్టుని కాపాడింది. కెప్టెన్ అసద్ వాలా (21), కిప్లిన్ డోరిగా (27), చార్లెస్ అమిని (12), ఛాద్ సోపర్ (10) వీరే రెండంకెల స్కోరు చేశారు.
వెస్టిండీస్ బౌలింగులో అకైల్ హోసైన్ 1, రొమారియా 1, ఆండ్రీ రసెల్ 2, అల్జారీ జోసెఫ్ 2, గుడాకేష్ మోటీ 1 వికెట్ తీశారు.