Princess Diana’s Personal Letters to be Auctioned: ఎంతగానో ప్రజాభిమానం సంపాదించుకున్న బ్రిటన్ ప్రిన్సెస్ డయానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందమే కాదు.. సేవాగుణం కూడా ఆమెకు ఎక్కువే. అయితే, ఈమెకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులను వేలం వేయనున్నారు. తన వ్యక్తిగత సేవకుడికి రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు అందులో ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను కూడా అందులో ఆమె పంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి స్థానిక మీడియా ప్రకారం.. బ్రిటన్ ప్రిన్సెస్ డయానా తన మాజీ హౌస్ కీపర్ మౌడ్ పెండ్రీతో తన జీవితంలో మధుర క్షణాలు, అనేక సంఘటనలకు సంబంధించిన అనుభవాలు పంచుకున్నారు. ఆమె జీవితంలోని మైలురాళ్లను ప్రస్తావించారు. ప్రిన్స్ చార్లెస్ తో 1981లో డయానాకు వివాహం జరిగిన తరువాత, తన హనీమూన్ విషయాలను పేర్కొన్నారు. అదేవిధంగా తన మొదటి సంతానమైన విలియం జన్మించినప్పుడు కలిగిన సంతోషాలను కూడా అందులో పంచుకున్నారు. ‘విలియం రాకతో నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. తల్లిగా నేను ఎంతో గర్వంగా ఉన్నాను. నేను అదృష్టవంతురాలిని’ అని ఓ లేఖలో రాసుంది.
Also Read: చంద్రుడిపై ల్యాండ్ అయిన వ్యోమ నౌక.. రోబో సాయంతో మట్టి నమూనాల సేకరణ
అదేవిధంగా నూతన సంవత్సరం, క్రిస్మస్ వేడుకల వేళ ఆమె ఇతరులకు రాసినటువంటి లేఖలు కూడా వేలానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికాలోని బెవర్లీ హిల్స్లో ఉన్న జులియన్ ఆక్షన్ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో జూన్ 27న వేలం నిర్వహించనున్నారు. అయితే, ప్రిన్సెస్ డయానా.. 1996లో చార్లెస్ తో విడాకులు తీసుకున్న ఆమె, ఆ మరుసటి ఏడాదిలో జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందారు.