Delhi CM Aravind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం తిహార్ జైలులో లొంగిపోయారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయన జైలుకు చేరుకున్నారు. ఇంట్లో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.
అనంతరం అక్కడి నుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కొద్దిసేపు మాట్లాడిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యంతర బెయిల్ పై బయటికి రావడంతో ఎన్నికల ప్రచారంలో తన ప్రయత్నాలు ఫలించాయన్నారు. 21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదన్నారు. కూటమి తరఫున ప్రచారం చేశానన్నారు. దేశ ప్రయోజనాలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఆ తరువాతే పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తా అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందంటూ పరోక్షంగా మోదీ సర్కారును ఉద్దేశిస్తూ ఆయన ఆరోపించారు.
కాగా, మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై మే 10న జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అదేవిధంగా జూన్ 2న తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్ ను ఆదేశించిన విషయం విధితమే.
Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్
లోక్ సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో కోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ తిహార్ జైలులో సరెండర్ అయ్యారు. దీంతో అధికారులు ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.