T20 World Cup 2024: టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ లు షురూ అయ్యాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో సత్తా చాటింది. పిచ్ సహకరించకపోయినా ఎంతో జాగ్రత్తగా ఆడుతూ 182 పరుగులు చేయడం చిన్న విషయం కాదని అంటున్నారు. అలాగే బౌలింగులో కూడా బంగ్లాదేశ్ ను ఎక్కడా కోలుకోనివ్వలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలింగ్ ఛేంజ్ చేసిన విధానం చాలా డిఫరెంటుగా ఉంది.
ఫస్ట్ ఓవర్ అర్షదీప్ వేస్తే, సెకండ్ ఓవర్ బుమ్రా వేశాడు. మూడో ఓవర్ మళ్లీ అర్షదీప్ వేశాడు. మళ్లీ నాలుగో ఓవర్ బుమ్రాకి ఇవ్వకుండా సిరాజ్ కి ఇచ్చాడు. అలా టీమ్ లో అందరినీ వరుసగా ప్రయత్నించాడు. ఇదే మంచి ఫలితాలనిచ్చింది. ధనాధన్ 5 వికెట్లు వచ్చాయి. రాబోయే మ్యాచ్ ల్లో ఇలాంటివెన్నో వ్యూహాలు ఉంటాయని నెటిజన్లు అంటున్నారు.
ఇకపోతే టీమ్ ఇండియాలో ముగ్గురు గేమ్ ఛేంజర్స్ ఉన్నారు. వారు ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్. వీరు ముగ్గురు క్లిక్ అయితే, ఆ రోజు మ్యాచ్ లో తిరుగుండదు. ఒంటిచేత్తో విజయాలను అందించే మొనగాళ్లుగా పేరుపొందారు. ప్రాక్టీసు మ్యాచ్ లో రిషబ్ పంత్ టచ్ లోకి రావడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. ఇక మనకు భయం లేదు. కుర్రాడున్నాడు…అతనే అంతా చూసుకుంటాడని అనుకుంటున్నారు.
దానికి తోడు సూర్యకుమార్ యాదవ్ హిట్టింగ్ కి వెళ్లకుండా ఆచితూచి ఆడటం కూడా అందరికీ నచ్చింది. ఇక బుమ్రా తన వరకు తను న్యాయం చేసి పరుగులను కట్టడి చేశాడు. మరోవైపు రోహిత్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ.. సంజు శాంసన్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి జట్లకు భయం పుట్టించేలా ఉంది.
Also Read: ఒకే ఒక్క నిమిషం.. అంతే! లేదంటే 5 పరుగుల పెనాల్టీ
మరోవైపు పవర్ ప్లేలో అర్షదీప్ సింగ్ కి వికెట్లు పడటం ఆశాజనకంగా ఉంది. పవర్ ప్లే లో బ్రేక్ దొరికితే తర్వాత వచ్చినవారు నెమ్మదిగా ఆడతారు. 6 ఓవర్ల తర్వాత గ్రౌండ్ అంతా ఫీల్డర్లని మొహరించి…ప్రత్యర్థులను క్లోజ్ చేసేస్తారు. ఇదీ గేమ్ ప్లాన్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. మొత్తానికి ప్రాక్టీస్ మ్యాచ్ వల్ల టీమ్ ఇండియాలో ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరిగిందని అంటున్నారు. 5వ తేదీన ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ కోసం.. జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు మొదలుపెట్టింది.