ICC New Rule At T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ అంటే తమాషా అనుకున్నారా? అయితే చూడండి.. ఎంత కఠినమైన రూల్స్ విధించారో తెలుసా? అయ్యబాబోయ్ అనిపించక మానదు. ఇంతకీ ఆ రూల్ ఏమిటంటే.. ఓవర్ వేయడంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. నిజానికి ఒకటి లేదా రెండు పరుగుల తేడాతో మ్యాచ్లు ఓడిపోతుంటారు.
మ్యాచ్లో ఆ 5 పరుగులే అంటే కొంప ముంచేలా ఉన్నాయని కెప్టెన్లు బాధ. చివర్లో అవే జయాపజయాలను నిర్ణయిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్-2024 ఇది ప్రయోగాత్మకంగా అమలు చేశారు. కొందరు కెప్టెన్లకు పెనాల్టీలు విధించారు. అలా హార్దిక్ పాండ్యా, శుభ్మన్గిల్ వంటి ఆటగాళ్లు భారీ పెనాల్టీలు కట్టారు.
కానీ ఇక్కడ టీ 20 ప్రపంచకప్లో డబ్బులు కాదు. అంతకన్నా విలువైన పరుగులనే పెనాల్టీగా విధిస్తారు. నిజానికి డబ్బులు పోతే పోయాయి. మ్యాచ్ గెలిస్తే చాలని ఇంతకుముందు అనుకునేవారు. అందుకనే కెప్టెన్లు లెక్క చేయలేదు. గ్రౌండులో వ్యూహాలు రచిస్తూ కూర్చున్నారు. ఇప్పుడలా లేదు. ఓవర్కి ఓవర్కి మధ్య ఒక నిమిషం మాత్రమే సమయం ఉంటుంది. అంటే 60 సెకన్లలోపు కొత్త బౌలర్ వచ్చేయాలి. లేదంటే 5 పరుగులు ప్రత్యర్థుల టీమ్ లో కలిసిపోతాయి. అదెలాగంటే.
ఓవర్ ముగిసిన వెంటనే ఒక సాఫ్ట్ క్లాక్ ని థర్డ్ అంపైర్ స్టార్ట్ చేస్తాడు. ఈ టైమ్ స్టేడియంలో అమర్చిన భారీ స్క్రీన్స్పై డిస్ ప్లే అవుతుంది. ఒకవేళ, ఫీల్డింగ్ టీమ్ నిర్ణీత సమయంలో ఓవర్ని ప్రారంభించకపోతే, రెండు సార్లు అంపైర్లు వార్నింగ్ బెల్స్ తో హెచ్చరిస్తాడు. మళ్లీ నిమిషం లోపు ఓవర్ స్టార్ట్ చేయకపోతే, ఫీల్డింగ్ టీమ్కి ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. అక్కడ నిమిషం ముల్లు తిరుగుతుంటే.. ఇక్కడ కెప్టెన్లు అందరికీ గుండెలు దడదడలాడుతూ ఉంటాయన్నమాట.
Also Read: టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ పరుగుల వరద.. అమెరికా ఘన విజయం
చాలామంది కెప్టెన్లు ఓవర్ అవుతుండగానే.. తర్వాత ఓవర్ నువ్వు వేయమని చెప్పేస్తున్నారు. దీనివల్ల 20 ఓవర్లు 20 నిమిషాల సమయం ఆదా అవుతోందని ఐసీసీ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బ్రాడ్ కాస్ట్ వాళ్లతో తలనొప్పులు తగ్గుతున్నాయి. లేకపోతే వారికి ఐసీసీ పెనాల్టీ కట్టాల్సి వస్తోంది.
ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన వెంటనే.. బ్రాడ్ కాస్ట్ సంస్థలు.. వేరే ప్రోగ్రాంకి టైమ్ స్లాట్ చేస్తాయి. ఇక్కడ మ్యాచ్ ఆలస్యమైతే.. వారి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ లో ఆర్డర్ తేడా వస్తుంది. దీంతో కొన్ని ప్రోగ్రామ్స్ ను తీసేస్తుంటారు. అందువల్ల వారికి బ్రాడ్ కాస్ట్ సంస్థలు పెనాల్టీలు కట్టాలి. రెండవది ఎక్స్ ప్లెనేషన్స్ ఇవ్వాలి. ఇదంతా ఎందుకని ఎప్పటి నుంచో ఐసీసీ మీద బ్రాడ్ కాస్ట్ సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. మొత్తానికి ఇప్పటికి అది అమల్లోకి వచ్చింది.
అయితే ఈ రూల్కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొత్త బ్యాటర్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు, అంపైర్లు ఇచ్చే అఫిషియల్ డ్రింక్స్ బ్రేక్, ఫీల్డ్లో ఆటగాడికి తగిలిన గాయానికి చికిత్స చేయడం వంటి వాటికి అంపైర్లు అనుమతించిన సమయాల్లో స్టాప్ క్లాక్ రూల్ వర్తించదు. ఇతర సమస్యలు, ఇతర అంశాలతో ఆలస్యం నెలకొన్నా 60 సెకన్లలో కొత్త ఓవర్ ప్రారంభించాల్సిన అవసరం లేదని ఐసీసీ రూల్స్ బుక్స్ లో ఉన్నవాటిని నెటిజన్లు కోట్ చేస్తున్నారు.