KCR comments on exit polls: సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎవరికి నచ్చినట్టు ఆయా సర్వే సంస్థలు అంచనాలను వెలువరించాయి. అయితే ఈసారి బీఆర్ఎస్కు ఒక్క సీటు గెలుస్తుందని కొన్ని సంస్థలు, మరికొన్నైతే ఏమీ గెలవదని వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్ మాదిరిగా తయారైందన్నారు. బీఆర్ఎస్కు 11 వస్తాయని ఒకరంటే, కేవలం ఒక సీటు వస్తుందని మరొకరు చెప్పారని గుర్తు చేశారు. 11 సీట్లు వచ్చినా పొంగిపోయేది లేదని, మూడు వచ్చినా కుంగిపోయేది లేదన్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము గెలిచామన్నారు కేసీఆర్. అక్కడ 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని సీఎం ఒకప్పుడు వ్యాఖ్యానించారని, అక్కడే తాము 100 ఓట్లు మెజార్టీతో గెలిచామన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అంటే మహా వృక్షమని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత నైరాశ్యంలో ఉన్నామన్నారు. బస్సుయాత్ర మొదలు కాగానే మళ్లీ అదే గర్జన మొదలయ్యిందన్నారు. మళ్లీ గెలిచేది తామేనని చెప్పుకొచ్చారు. కేవలం 1.08 శాతం తేడాతో తాము ఓడిపోయామన్నారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసమన్నారు.
తెలంగాణ భనవ్లో రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొన్నారు మాజీ సీఎం కేసీఆర్. అంతకుముందు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆదివారం అంటే ఈ రోజు ఉద్విగ్నమైన క్షణమన్నారు. తెలంగాణ అంశం పరిహాస్యాస్పదంగా ఉండేదని, రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని చాలా మంది ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని గతంలో స్పీకర్ అసెంబ్లీలో అన్నారని ఈ సందర్భంగా వివరించారు.
ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వాదని, ఆయనలాంటి మనుషులు అరుదుగా ఉంటారన్నారు కేసీఆర్. ఈ సమయంలో ఆయన్ని స్మరించుకోకుండా వుండలేమన్నారు. తెలంగాణ బాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో 70 మందికిపైగా చనిపోయారన్నారు. ముల్కీ నిబంధనల అంశం చాలా ఏళ్లు న్యాయ పోరాటంగా మారింది. చివరకు ఈ నిబంధనలు సమంజసమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
న్యాయస్థానం జోక్యంతో కేంద్రం రాజ్యాంగ సవరణ చేసిందన్నారు బీఆర్ఎస్ అధినేత. న్యాయస్థానం తీర్పుతో జై ఆంధ్రా ఉద్యమం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఘం కొనసాగిందన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాళ్లను సీఎంలుగా కానీయలేదన్నారు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణ వాళ్లే సీఎంలు అయ్యారన్నారు. తెలంగాణ వ్యక్తి సీఎం కాగానే ఏదో గొడవపెట్టి పీఠం నుంచి దించేవారని వివరించారు.
ALSO READ: అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి, హైదరాబాద్ ఇక తెలంగాణదే.. ఏపీతో తెగిన బంధం
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైందన్నారు కారు పార్టీ అధినేత. 2001 ఉద్యమం అలా కాదన్నారు. ఉద్యమం రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుందన్నారు. ఉద్యమం మొదలు కాగానే పైసలు కోసం మొదలుపెట్టారనే ప్రచారం చేశారన్నారాయన. ఆఫీసు కోసం తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తికి ఖాళీ స్థలం దొరకని పరిస్థితి నెలకొందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొనకపోయినా, పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు కేసీఆర్ తాను చెప్పాల్సిన నాలుగు మాటలను సూటిగా చెప్పేశారాయన.