Kia India has recorded sales of 19,500 units in May 2024: కియా కార్లకు మార్కెట్లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఈ కంపెనీ కార్లపై వాహన ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు, మైలేజీనీ అందించడమే గాక మంచి అనుభూతిని అందించడంలో ఈ కంపెనీ కార్లు ముందుంటాయి. అందువల్లనే ఈ కంపెనీ కార్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఈ ఏడాది గత నెలలో కియా కార్లు సేల్స్ బాగా వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో సేల్ అయిన మొత్తం కార్ల డేటాను కియా ఇండియా తాజాగా రిలీజ్ చేసింది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
కియా ఇండియా మే 2024కి సంబంధించిన డేటాను తాజాగా విడుదల చేసింది. కార్ల తయారీదారు కియా ఇండియా మే 2024లో ఏకంగా 19,500 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపింది. అయితే గత ఏడాదితో పోలిస్తే కంపెనీ వార్షిక వృద్ధి 3.9 శాతం కంటే ఎక్కువగా ఉంది. జనవరి 2024లో ప్రారంభించబడిన కొత్త కియా సోనెట్, మే 2024లో 7,433 యూనిట్లు విక్రయించడంతో కియా ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది.
భారతీయ మార్కెట్లో ఈ కాంపాక్ట్ SUV ప్రారంభ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంది. ఇక ఈ ఎస్యూవీతో పాటు కియా సెల్టోస్ 6,736 యూనిట్లు, కియా కేరెన్స్ 5,316 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇర ఈ నెలలో కియా 2,304 యూనిట్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. దీంతో మొత్తంగా కియా ఉత్పత్తి సంఖ్య 21,804 యూనిట్లకు చేరుకుంది. అయితే కంపెనీ తన స్థిరమైన ఎగుమతి వ్యూహాన్ని అనుసరించడం ద్వారా 100 కంటే ఎక్కువ దేశాలలో 2.5 లక్షల ఎగుమతుల సంఖ్యను దాటింది. ఇందులో కియా సెల్టోస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. భారతదేశం నుండి 60 శాతం ఎగుమతులు ఈ మోడల్ ద్వారా జరుగుతున్నాయి.
Also Read: కియా నుంచి బడ్జెట్ కార్.. లాంచ్ ఎప్పుడంటే?
దీనిపై కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు తమ మోడల్స్లో కొత్త పోటీ వేరియంట్లను పరిచయం చేయడంలో తాము దూకుడుగా ఉన్నాము అని అన్నారు. ఇది తమ అమ్మకాలకు గణనీయంగా దోహదపడింది అని తెలిపారు. బలమైన నెట్వర్క్ విస్తరణ వ్యూహంతో తాము మిగిలిన సంవత్సరంలో వృద్ధిని కొనసాగిస్తామని.. త్వరలో 1 మిలియన్ దేశీయ విక్రయాల మైలురాయిని దాటుతామని పేర్కొన్నారు.
కంపెనీ దేశీయ విపణిలో 9.8 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. వీటిలో సెల్టోస్ దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉంది. కియా ఇండియా తన రెండు గ్లోబల్ మోడల్లు, వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ EV9, కొత్త కార్నివాల్లను సంవత్సరం ద్వితీయార్థంలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.