India Vs Bangladesh Highlights,T20 World Cup 2024 Warm-up Match: టీ 20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్ లో అన్నింటా పై చేయి సాధించింది. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా బ్యాటింగులో రాణించారు. అర్షదీప్ సింగ్, శివమ్ దుబె బౌలింగులో రాణించారు.
బ్యాటింగుకి అతి కష్టంగా ఉన్న పిచ్ పై టీమ్ ఇండియా.. 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ ని 122 పరుగులకి కట్టడి చేసింది. అలాగే బౌలింగులో రాణించి 8 వికెట్లు తీసింది. మొత్తానికి 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
వివరాల్లోకి వెళితే… టీమ్ ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. ఓపెనర్ గా రోహిత్ శర్మతో పాటు సంజూ శాంసన్ వచ్చాడు. యశస్వి జైశ్వాల్ కి రెస్ట్ ఇచ్చారు. కానీ వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ (1) ఉపయోగించుకోలేదు. త్వరగా అయిపోయాడు. ఇక్కడ మరో ప్రయోగం జరిగింది.
ఎలాగంటే విరాట్ కొహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడకపోవడంతో రిషబ్ పంత్ కి ప్రమోషన్ ఇచ్చారు. దాంతో ఫస్ట్ డౌన్ వచ్చిన పనిని పంత్ సక్సెస్ ఫుల్ గా దానిని పూర్తి చేశాడు. ఎంతో సాధికారికంగా ఆడాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అందరూ తడబడుతున్న పిచ్ పై రిషబ్ పంత్ ఎడాపెడా సిక్స్ లు కొట్టి పారేశాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. మరొకరికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో రిటైర్డ్ అవుట్ గా పెవెలియన్ బాట పట్టాడు. కారు ప్రమాదంలో గాయపడి, మళ్లీ తొలిసారిగా జాతీయ జట్టుతో కలిసి వార్మప్ మ్యాచ్ ఆడి, అందరికీ పూర్వపు పంత్ ని గుర్తు చేశాడు.
Also Read: వాళ్లు.. మనోళ్లే..! టీ 20 ప్రపంచకప్ ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు
తర్వాత సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత శివమ్ దుబె (14) కొంచెం నిరాశ పరిచాడు. అనంతరం హార్దిక్ పాండ్యా వచ్చి వరుసగా హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టాడు. తను ఫామ్ లో లేడని అన్న అందరి నోళ్లూ మూయించాడు.
అలా 23 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనే స్కోరుని 180 దాటించాడు. రవీంద్ర జడేజా (4) నాటౌట్ గా ఉన్నాడు. మొత్తానికి టీమ్ ఇండియా 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బౌలింగులో మెహిద్ హాసన్ 1, షోర్ ఫుల్ ఇస్లాం 1, మహ్మదుల్లా 1, తన్వీర్ ఇస్లాం 1 వికెట్లు పడగొట్లారు.
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగుకి దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. మొదటి ఓవర్ లోనే సర్కార్ (0) వికెట్ పడిపోయింది. అర్షదీప్ బౌలింగులో అవుట్ అయిపోయాడు. తర్వాత మూడో ఓవర్ మళ్లీ అర్షదీప్ వేశాడు. ఈసారి లిటన్ దాస్ (6) ని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 7 పరుగులకి 2 వికెట్లతో బంగ్లాదేశ్ కష్టాల ముంగిట నిలిచింది.
ఈ క్రమంలో రోహిత్ శర్మ ఏం చేశాడంటే…ఆల్రడీ ఒక ఓవర్ వేసిన బూమ్రాని కాదని , కొత్తగా సిరాజ్ కి బౌలింగ్ ఇచ్చాడు. తను వెంటనే కెప్టెన్ నజ్ముల్ హొసైన్ షాంతో (0)ని అవుట్ చేశాడు. అప్పుడు 3 వికెట్లకి 10 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ కూరుకుపోయింది. తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగుకి వచ్చి ఓపెనర్ తంజిద్ హాసన్ (17) అవుట్ చేశాడు. అంతే 39 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి…ఓటమి బాటలోకి వెళ్లిపోయింది. మళ్లీ ఏ దశలోనూ బంగ్లా కోలుకోలేదు.
తర్వాత అక్షర్ పటేల్ బౌలింగులో తౌహిద్ (13) అవుట్ అయ్యాడు. ఇలా రోహిత్ శర్మ ప్రతీ ఒక్కరితో బౌలింగు చేయించాడు. షకీబ్ఆల్ హాసన్ (28) కాసేపు ఆశలు నింపాడు. కానీ త్వరగా అయిపోయాడు. బంగ్లాదేశ్ లో కూడా మహ్మదుల్లా బ్రహ్మాండంగా ఆడుతుంటే రిటైర్డ్ అవుట్ గా వెనక్కి పంపించారు. తను 28 బంతుల్లో 1 సిక్సర్, 4 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.
Also Read: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జర భద్రం!
రిషాద్ హోసైన్ (5), మెహదీ హాసన్ (3) అవుట్ అయిపోవడంతో బంగ్లాదేశ్ కథ ముగిసిపోయింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ మరో వికెట్ తీసుకున్నాడు. కానీ చివరి 19 ఓవర్ ని కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా శివమ్ దుబెకి ఇచ్చాడు. తను కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రెండు వికెట్లు పడగొట్టాడు.
మొత్తానికి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో టీమ్ ఇండియా రాణించింది. ఇదే స్ఫూర్తితో 5వ తేదీన ఐర్లాండ్ తో జరిగే తొలి టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుందాం.