Violence in West Bengal During 7th Phase Polling: లోక్ సభ తుది దశ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బెంగాల్ రాజధాని కోల్కతాకు దగ్గర్లోని జాదవ్ పూర్ లోక్ సభ నియోజకవర్గంలో సీపీఎం, ఐఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
సౌత్ 24 పరగణాల జిల్లాలో ఓ పోలింగ్ బూత్ లోకి చొరబడిన జనం.. ఈవీఎంతో పాటు ఎన్నికల సామగ్రిని ఎత్తుకెళ్లి దగ్గర్ లోని నీటి కుంటలో పడేశారు. భాన్ గర్ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏఐఎస్ఎఫ్ అభ్యర్థికి చెందిన వాహనాన్ని ధ్వంసం చేశారు.
అటు ఇదే జిల్లాలోని జయ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కుల్తాలీలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. పోలింగ్ బూత్లోకి తమ ఏజెంట్లను అనుమతించట్లేదని ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు పొలింగ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంతటితో ఆగకుండా మూకుమ్మడిగా పోలింగ్ బూత్లోకి చొరబడ్డారు. అటు ఎన్నికల సామగ్రిని చెల్లాచెదురు చేసి ధ్వంసం చేశారు. ఓ ఈవీఎంతో పాటు వీవీప్యాట్ మెషిన్లను ఎత్తుకెళ్లారు. వాటిని దగ్గర్లోని ఓ నీటి కుంటలో పడేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నీటిలో పడేసిన ఎన్నికల సామగ్రిని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను వెలికితీశారు.
Also Read: ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ.. ఏపీలో ప్రభుత్వం మారుతుందా? నేషనల్ కింగ్ అయ్యేదెవరో ?
అయితే, ఈ ఘటనపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కుల్తాలీలో ముందు జాగ్రత్త చర్యగా అదనంగా ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్లనే నీటి కుంటలో పడేశారని పేర్కొంది. కుల్తాలీ పోలింగ్ బూత్ లో పోలింగ్ యథావిధిగా జరుగుతోందని స్పష్టం చేసింది. సెక్టార్ ఆఫీసర్ కు మరో ఈవీఎంను అందజేసినట్లు తెలిపింది. ఇక ఈ ఘటనపై కుల్తాలీ సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారని పేర్కొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్ వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.