Exit Polls 2024 : ఇక మూడు రోజులే. మూడంటే మూడు రోజుల్లో ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అటు 18వ లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అంతకంటే ముందు.. చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అందరూ వీటికోసమే ఎదురుచూస్తున్నారు. ఏపీలో అభ్యర్థులు, ప్రజలంతా 19 రోజులుగా వీటి కోసమే ఎదురుచూస్తున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారో, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో దాదాపు ఎగ్జిట్ పోల్స్ లోనే తెలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలకు కాస్త అటూ ఇటూగా సీట్లు సాధిస్తాయి పార్టీలు.
వై నాట్ 175 అనే స్లోగన్ తో ప్రచారం చేసిన వైసీపీ గెలుపు ధీమాతో ఉండగా.. వైసీపీ పనైపోయిందని ఈసారి తమదే పైచేయి అవుతుందని కూటమి నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం ఫలితంపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారైనా పవన్ గెలుస్తారా లేదా అని ఎదురుచూస్తున్నారు.
మరోవైపు కేంద్రంలో మళ్లీ మోదీ వస్తారా లేదా అన్నదానిపైనా ఉత్కంఠ నెలకొంది. చార్ సౌ పార్ అనేది బీజేపీకి సాధ్యమవుతుందా లేదా విపక్ష ఇండియా కూటమి ఫామ్ లోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ లో కచ్చితమైన ఫలితాలు రావు కానీ.. ఒక అంచనాను మాత్రం మన ముందుంచుతాయి. నిజం అవ్వొచ్చు.. కాకపోవచ్చు.
Also Read : తుది విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. నేడే ఎగ్జిట్ పోల్స్
గతంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే.. చాలా వరకూ ఫలితాలు నిజమయ్యాయి. 1998లో జరిగిన లోక్ సభ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి 200 సీట్లకు పైగా మెజారిటీ వస్తుందని చెప్పగా.. 252 సీట్లొచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 166 సీట్లొచ్చాయి. అలాగే 2014, 2019 ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి.
2021లో జరిగిన కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా.. చాలా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తుది ఫలితాల్లో వచ్చాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పలేదు. కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేస్తూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ దగ్గరగానే ఫలితాలు వెల్లడయ్యాయి. మరి ఈ రోజు సాయంత్రం వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్.. తుది ఫలితాల అంచనాలకు దగ్గరగా ఉంటాయో లేదో చూడాలి. ఇది తెలియాలంటే ఫైనల్ ఫలితాలొచ్చే వరకూ వేచి చూడక తప్పదు.