AB Venkateshwara Rao Retired: ‘నేను ఈరోజు వృత్తిరీత్యా మాత్రమే రిటైరవుతున్నా.. అంతేకానీ, చివరి శ్వాస వరకు అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటా.. బాధితుల తరఫున పోరాడుతూనే ఉంటా’నంటూ తాజాగా పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు భావోద్వేగంతో అన్నారు. సస్పెన్షన్ పై సుదీర్ఘంగా న్యాయపోరాటం చేసి వియజం సాధించిన ఏబీవీ సగర్వంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సర్వీసులో చివరి రోజైన శుక్రవారం ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాంతీయ ఆఫీసులో బాధ్యతలు చేపట్టి.. సాయంత్రానికి పదవీ విరమణ చేశారు. అయితే, పోలీస్ శాఖలో డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీవీ డీజీపీ కాకుండానే రిటైర్ అయ్యారు. అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రిటైర్ అయినా కూడా జీవితాంతం ప్రజా సేవలోనే ఉంటానన్నారు. భవిష్యత్తులో ఇంకా సేవ చేసేందుకు అవకాశం వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. సర్వీసులో ఉన్నన్ని రోజులు నీతి, నిజాయితీతో పనిచేశానన్నారు. పూర్తి సంతృప్తితో తాను పదవీ విరమణ చేస్తున్నట్లు చెప్పారు. వృతి రీత్యా తాను ఎంతోమందిని చూశానన్నారు. తన పోరాటాన్ని చూసి లక్షల మంది స్పందించారన్నారు. వారందరికీ రుణపడి ఉంటానన్నారు. తన బాధ, పోరాటం, నిజాయితీ ఎంతోమందికి దగ్గర చేశాయని ఆయన కొంత భావోద్వేగంతో పేర్కొన్నారు.
Also Read: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత కూడా నచ్చినవారికి..
కాగా, ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) తొలగించింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సర్వీసులోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. దీంతో ఆయన ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు.. సాయంత్రం పదవీ విరమణ చేశారు.