CM Revanth Reddy Sent Special Invitation to KCR: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వాన పత్రికను పంపింది. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్.. బంజారాహిల్స్ లోని నంది నగర్ లో ఉన్న నివాసంలో సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట పలువురు అధికారులు కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆయన వెళ్లి కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ.. కేసీఆర్ సానుకూలంగా స్పందించారంటూ ఆయన పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. 1860 మంది వీవీఐపీలు, 11 వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్కులో అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఉత్తమ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేస్తారు.
Also Read: ‘అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్కు అభ్యంతరం ఎందుకు..?’
సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్ ను సందర్శిస్తారు. ఆ తరువాత తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. అదేవిధంగా అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తరువాత జాతీయ జెండాలతో భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపిస్తారు. అనంతరం తెలంగాణ కవి అందెశ్రీని సన్మానిస్తారు. అదేవిధంగా 10 నిమిషాలపాటు బాణసంచా పేల్చే కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.