Nagpur Heatwave Hits 56C : దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఢిల్లిలో ఇటీవల 52 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దాన్ని దాటి మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నాగ్పుర్లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేయగా..అందులోని రెండింటిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోనేగావ్ లోని ఏడబ్ల్యూ స్టేషన్లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతే కాకుండా ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా..మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
ఇటీవల ఢిల్లీలోని ముంగేష్పూర్ లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఢిల్లీ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఆ సమయంలో సెన్సార్ సరిగా పనిచేస్తుందో లేదో అని తనిఖి చేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. కానీ ప్రస్తుతం నాగ్పుర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తీవ్రమైన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు
దేశ వ్యాప్తంగా ఎండల కారణంగా 54 మంది మృతి చెందారు. అత్యధికంగా బీహార్ లో 32 మంది మృతి చెందగా..ఒడిశాలో 10, జార్ఖండ్లో5, రాజస్థాన్లో 5, ఉత్తరప్రదేశ్లో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. వచ్చే రెండు రోజుల్లో ఢిల్లీ, చండీఘర్, హర్యానాతో పాటు పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలులు ఎక్కువగా ఉండటం వల్ల దేశంలో జాతీయ ఎమర్జెన్సీని విధించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సూచించింది.