Prices of Salt have increased Drastically in AP: ఏపీలో ప్రస్తుతం ఉప్పు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మా ఉప్పుకు గిరాకీ పెరిగిందంటూ’ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని ట్యుటికోరన్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉప్పు పండిస్తుంటారు. అయితే, ఈసారి అక్కడ భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఉప్పు తయారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఉప్పు ఎగుమతి తగ్గింది.
ఇటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా ఉప్పును తయారు చేస్తుంటారు. వారికి ప్రస్తుతం గిరాకీ భారీగా పెరిగింది. ఇటు వాతావరణం అనుకూలించడం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండడంతో ఉప్పు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తమిళనాడులో ఉప్పు తయారీ తగ్గడంతో అక్కడికి చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఉప్పును కొనుక్కుని వెళ్తున్నారని ఉప్పు రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉప్పు ధర భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 75 కేజీల ఉప్పు బస్తా ధర నిన్నమొన్నటివరకు రూ. 100 నుంచి రూ. 150 వరకు పలికిందని, తాజాగా తమిళనాడు నుంచి భారీ ఎత్తున వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో ఉప్పు బస్తా ధర రూ. 200 పలుకుతుందని ఉప్పు రైతులు చెబుతున్నారు.
Also Read: మిస్ వైజాగ్ నక్షత్ర.. న్యూట్విస్ట్, కనిపించని భర్త-ప్రియురాలు.. వెనుక ఆ నేత?
ఏపీలో పలు ప్రాంతాల్లో ఉప్పును తయారీ చేస్తుంటారు. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు ఉప్పును ఉత్పత్తి చేస్తుంటారు. వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో ఉప్పునే ఉత్పత్తి చేస్తుంటారు. అయితే, ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఉప్పు ఉత్పత్తి పెరిగిందని రైతులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఉప్పును ఉత్పత్తి చేశాం.. ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.