Uravakonda Next MLA 2024 Visweswara Reddy vs Payyavula Keshav: ఆ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సెంటిమెంట్ కొనసాగుతుంది. అది అదృష్టమో , దురదృష్టమో కాని ఆ సెగ్మెంట్లో ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్ధి గెలుస్తారో.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతుంది. అక్కడ టీడీపీ నుంచి ఒక లీడర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి అదే జరుగుతోంది .. గత 7 ఎన్నికలుగా అదే జరుగుతూ వస్తోంది. అలాగని అక్కడ వార్ వన్సైడ్గా ఉండదు. ఎప్పుడూ హోరాహోరీ పోరే జరుగుతుంది. ఆ లెక్కలతో ఈ సారి అక్కడ గెలిచేదెవరన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ సారైనా సదరు అభ్యర్ధి సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా? అసలింతకీ అంత చిత్రమైన సెంటిమెంట్ ఉన్న సెగ్మెంట్ ఏది?
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం.. కర్ణాటకకు సరిహద్దున ఉన్న నియోజకవర్గం ఇది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 6సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్, రెండు సార్లు ఇండిపెండెంట్లు , ఒకసారి వైసీపీ విజయం సాధించాయి. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఉరవకొండలో బోయ, ముస్లింలు, చేనేత ఓటర్లు కీలకంగా ఉంటారు. అయితే ఆయా వర్గాల అభ్యర్ధులు అక్కడ పోటీ చేసింది తక్కువ .. కమ్మ, రెడ్డి సామాజికవర్గాల నేతలే అక్కడ కాలుదువ్వుతుంటారు. ఇక ఈ సారి కూడ పాత ప్రత్యర్థులులే మరోసారి రెండు ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైసీపీ నుంచి చిరకాల ప్రత్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు.
పయ్యావుల కేశవ్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. 1999లో టీడీపీ అభ్యర్ధిగా ఉరవకొండ నుంచి పోటీ చేసిన కేశవ్ పరాజయం పాలయ్యారు. 2004,2009, 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు … 2004 ఎన్నికల నుంచి విశ్వేశ్వరరెడ్డే ఆయనకు ప్రత్యర్ధిగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి తొలిసాని కేశవ్పై విజయం సాధించారు. ఈ సమయంలో ఆయనను టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి… శాసనమండలి విప్ పదవి కట్టబెట్టింది. మంచి వాగ్ధాటి ఉన్న నేతగా పయ్యావులకు పేరుంది. పయ్యావుల కేశవ్ కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాజకీయంగా ఆయన ఇక్కడ పటిష్టంగా ఉన్నారు. వ్యక్తిగతం పయ్యావుల కేశవ్ కు ఉన్న బలంతో పాటు 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు ఉండడంతో ఇది మరింత లాభిస్తుందని అంతా అనుకుంటున్నారు.
వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి తన చిరకాల ప్రత్యర్థి తో తలపడ్డారు.. ఆయన కూడా స్థానికంగా పలుకుబడి ఉన్న బలమైన నాయకుడే.. సౌమ్యుడిగా పేరుంది. అయితే వైసీపీలో వర్గపోరు కొనసాగుతోంది. ఎమ్మెల్సీ శివరాంరెడ్డికి మాజీ ఎమ్మెల్యేకు పొసగడం లేదు. ఎమ్మెల్సీ శివరాం వైసీపీ లో ఉన్నప్పటికీ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పని చేయలేదన్న టాక్ నడుస్తోంది. గతంలో విశ్వేశ్వర రెడ్డి రెండుసార్లు ఓడిపోయారు. ఒకసారి గెలిచారు.
Also Read: చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్యేల్యేల్లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?
గత ఎన్నికల్లో ఓటమికి కారణం వర్గపోరు అని కేవలం 2వేల ఓట్ల తేడాతో తాను ఓడిపోయానని విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇక విశ్వేశ్వర్ రెడ్డి కి తన సొంత కుటుంబంలో కూడా విభేదాలు పొడ చూపాయి. వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే విశ్వేశ్వర్ రెడ్డిపై ఆయన తమ్ముడు భూకబ్జా, అవినీతి ఆరోపణలు చేశాడు ఇవి అప్పట్లో సంచలనంగా మారాయి. దాంతో విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడు మధుసూధన్ రెడ్డిని వైసిపి నుండి సస్పెండ్ చేశారు. దాంతో మధుసూధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఇదే ప్రధాన పార్టీ ప్రత్యర్థి పయ్యావుల కేశవ్ కు బలంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇక ఉరవకొండకు 1999 నుంచి ఒక చిత్రమైన సెంటిమెంట్ కొనసాగుతోంది. ఆ ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోతే.. టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టింది. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కేశవ్ విజయం సాధించారు .. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 2014లో తిరిగి పయ్యావుల కేశవ్ ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చి.. కేశవ్ సీనియార్టీని గౌరవించి ఎమ్మెల్సీని చేసింది. 2019లో కేశవ్ గెలవడం టీడీపీ విపక్షంలో కూర్చోవడంతో ఉరవకొండ సెంటిమెంట్ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది.
2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొండా విశ్వేశ్వరెడ్డి విషయంలోనూ అదే జరుగుతూ వచ్చింది. ఈ సారి వారిద్దరిలో ఒకరు గెలుస్తారు. వారి పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరికీ మినిస్టర్ ఛాన్స్ ఖాయమే అంటున్నారు. అయితే ఈ సారి విశ్వేశ్వరెడ్డికి పయ్యావులతో పాటు సొంత తమ్ముడు కూడా గండంగా మారారు. మరి ఈ సారి వారిద్దరిలో ఎవరు ఉరవకొండ సెంటిమెంట్ని బ్రేక్ చేసి కేబినెట్ బెర్త్ దక్కించుకుంటారో చూడాలి.