Revanth Govt plan after new emblem(Latest news in telangana): తెలంగాణ కొత్త చిహ్నం విషయంలో రేవంత్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? బీఆర్ఎస్ ఆందోళనతో రేవంత్ కేబినెట్ ఆలోచనలో పడిందా? కాకతీయ తోరణం, చార్మినార్ తొలగించడమే ఇందుకు కారణమా? ఎందుకు చిహ్నం విషయాన్ని వాయిదా వేసింది? దీని వెనుక ఏం జరిగింది? కొత్త చిహ్నం విషయాన్ని రేవంత్ సర్కార్ అసెంబ్లీలోనే ఎందుకు చర్చకు పెట్టాలని భావిస్తోంది? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి.
కొత్త చిహ్నం విషయంలో సీఎం రేవంత్రెడ్డి వెనకడుగు వేశారంటే కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి నేరుగా అసెంబ్లీలో చర్చకు పెట్టడం అన్నది ఆషామాషీ కాదని అంటున్నారు. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన విషయమని, దీని చర్చ కోసమైనా కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఖాయమని అంటున్నారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. తర్వాత సమావేశాలు జరిగినా అనారోగ్యం పేరుతో రాలేదు. ఈసారి ఎలాగైనా కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులోభాగంగా కొత్త చిహ్నం వ్యవహారం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. చిహ్నం విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శించే ఛాన్స్ ఇవ్వకూడదన్నది రేవంత్ సర్కార్ ఆలోచన.
రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడంతో అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించాలన్నది సీఎం నిర్ణయం. ముఖ్యమంత్రి సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నంపై కసరత్తు మొదలుపెట్టారు. కొత్త చిహ్నంలో బతుకమ్మ కనిపిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతు న్నాయి.
సీన్ కట్ చేస్తే… రీసెంట్గా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర అవతర దినోత్సవ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించారాయన. ఆ సందర్భంగా మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, చర్చించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని మనసులోని మాట బయటపెట్టారాయన.
ALSO READ: ఆవిర్భావ వేడుకలకు మీరు తప్పకుండా రావాలి.. KCRకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం!
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చిహ్నంపై చర్చ జరుగుతుంది. ఆయన రాకుంటే చిహ్నంపై నోరు ఎత్తే ఛాన్స్ కారు పార్టీకి ఉండదన్నమాట. మొత్తానికి సీఎం రేవంత్ ఉచ్చులో కేసీఆర్ చిక్కినట్టేనని రాజకీయ నేతలు చర్చించుకోవడం మొదలైంది.