Naveen Patnaik Reacts: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా సీఎం బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ స్పందించారు. తన ఆరోగ్యం క్షీణిస్తుందంటూ వస్తున్న వార్తల వెనుక కుట్ర దాగి ఉందా..? అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై నవీన్ మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు ఒక మంచి స్నేహితుడు అనుకున్నాను..కానీ, అతను తనపై ఇలా నిందలు వేయడం దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించడం సరికాదని ఆయన అన్నారు. స్నేహితుడి ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు ఫోన్ చేసి పరామర్శించాల్సింది పోయి ఈ విధంగా నిందలు వేస్తారనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటించారు. బారిపదాలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తోన్న వార్తల వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా..? అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే సీఎం ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తేల్చేందుకు స్పెషల్ గా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని వ్యాఖ్యనించారు. ఒడిశా సీఎం కదలికలను కూడా సీఎం సన్నిహితుడు పాండియన్ నియంత్రిస్తున్నారంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని మోదీ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
Also Read: ప్రచారం ముగిశాక ప్రతిసారి ఇలాగే చేస్తున్న మోదీ .. తాజాగా తమిళనాడులో..
కాగా, ఒడిశాలో ఆరు పార్లమెంటు నియోజకవర్గాలతోపాటు 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనున్నది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే.