Key Orders of AP GAD: సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సూచించింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎటువంటి పత్రాలు కానీ, వస్తువులు కానీ బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆ ఆదేశాల్లో జీఏడీ పేర్కొన్నది.
ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీలు లేదంటూ అందులో స్పష్టం చేసింది. అదేవిధంగా వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయ భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని తెలిపింది.
మరోవైపు, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా పలు సూచనలు చేశారు. ఫలితాలు తరువాత ఎలాంటి ర్యాలీలు తీయొద్దని చెప్పారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టిస్తే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణ ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే.
Also Read: ఫలితాల తర్వాత ర్యాలీలు తీయొద్దు: సీఈఓ
ఇంకో విషయమేమంటే.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఐదేళ్లు పూర్తయిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరోసారి కూడా తామే అధికారంలోకి రాబోతున్నాం.. మంచి పాలనను కంటిన్యూ చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.