AB Venkateswara Rao Met CS Jawahar Reddy : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నుంచి హైకోర్టులో ఊరట లభించింది. ఏబీవీపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఇటీవలే క్యాట్ ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. క్యాట్ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే రెండుసార్లు సస్పెన్షన్ కు గురైన ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది.
వెంటనే తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయనకు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తనకు పోస్టింగ్ ఇవ్వడంపై త్వరగా ఆదేశాలివ్వాలని ఏబీవీ సీఎస్ ను కోరారు.
Also Read : చంద్రగిరి డీఎస్పీపై వేటు, పెట్రోల్ బాంబులు కలకలం
డిఫెన్స్ ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించగా.. సస్పెన్షన్ ను సమర్థించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా సస్పెన్షన్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. డ్యూటీలో ఉన్న అధికారిని రెండేళ్లకంటే ఎక్కువకాలం సస్పెన్షన్లో ఉంచొద్దని పేర్కొంటూ.. సస్పెన్షన్ ను రద్దు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ అదే కారణంతో రెండోసారి సస్పెండ్ చేసింది. తనను రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించిన ఏబీవీకి కాస్త రిలీఫ్ దక్కింది. ఆయనపై సస్పెన్షన్ ను రద్దుచేస్తూ ఉత్తర్వులిస్తూ.. సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలను చెల్లించి, పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. క్యాట్ నిర్ణయాన్ని హైకోర్టు సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురవ్వగా.. ఏబీవీకి సస్పెన్షన్ నుంచి ఊరట దక్కింది.