Inauguration of Telangana Official Symbol Postponed: తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై భారీగా సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర గీతంతోపాటుగా అధికారిక చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, చిహ్నంకు సంబంధించి సూచనలు రావడంతో ఆవిష్కరణను ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా గీతాన్ని మాత్రమే విడుదల చేయనున్నది.
ఇదిలా ఉండగా, అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి.. ప్రముఖులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారిక చిహ్నం ఖరారైందని, ఇదే ఫైనల్ లోగో అంటూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. నిడివి ఎంత ఉందంటే..?
కాగా, రాష్ట్ర గీతం, చిహ్నం విషయమై చర్చించేందుకు సీపీఐ, సీపీఎం నేతలు, కాంగ్రెస్ నేతలు, కోదండరాంతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వీరితోపాటు ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేతలతో చర్చించి, వారు ఇచ్చిన పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి గీతాన్ని పాడి వినిపించారు. నేతలు ఆ పాటను విని బాగుందంటూ పేర్కొన్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఆ దిశగా పరిశీలించాలంటూ ప్రముఖ కవి అందెశ్రీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.