Kejriwal’s Interim Bail Extension Petition(Telugu news live): లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై.. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ గడువును పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో మరో వారంరోజుల పాటు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కొట్టివేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ ను తోసిపుచ్చింది.
మధ్యంతర బెయిల్ గడువు పొడిగింపు కోసమై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం కేజ్రీవాల్ కు సూచించింది. ఈ క్రమంలో ఆయన రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కాగా.. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ జూన్ 1వ తేదీతో ముగియనుంది. మే 10వ తేదీన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి అధికారిక పనులు చేయరాదన్న కండీషన్ తో బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారీగా మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఈడీ అధికారులు మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు 9 సార్లు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశాయి. వేటికీ ఆయన స్పందించకపోవడంతో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపింది. అక్కడి నుంచి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 21 రోజులపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. జూన్ 1తో ఆ బెయిల్ గడువు ముగియనుంది. ఈ లోగా బెయిల్ పెంపుకు ట్రయల్ కోర్టు సానుకూలంగా స్పందించకపోతే.. కేజ్రీవాల్ మళ్లీ జైలుకెళ్లక తప్పదు.