Southwest Monsoon Entered into Kerala : దేశ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు ఏపీని తాకే అవకాశాలున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఐఎండీ చెప్పిన కబురుతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
నైరుతి రాకతో కేరళ, ఈశాన్య రాష్ట్రాలను ఐఎండీ అలర్ట్ చేసింది. సముద్రతీర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రాకముందు నుంచే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఐఎండీ అంచనా ప్రకారం జూన్ 5 నాటికి రుతుపవనాలు కర్ణాటక, ఏపీ, అస్సాంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. జూన్ 10వ తేదీ నాటికల్లా తెలంగాణతోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ను రుతుపవనాలు తాకనున్నాయి. గురు, శుక్రవారాల్లో తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. కేరళలో 5 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. యూపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మహోబాలో 8 మంది, హమీర్ పూర్ లో 7గురు, చిత్రకూట్ లో ఆరుగురు, ఫతేపూర్ లో ఐదుగురు, బందాలో ముగ్గురు, జలౌన్ లో ఇద్దరు మరణించినట్లు వివరించారు. ప్రయాగ్ రాజ్ లో గరిష్టంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.