Rohit Sharma Wife Post on All Eyes On Rafah : ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా? ఎవరిని ట్రోల్ చేస్తారో ఎవరికీ తెలీడం లేదు..నిజానికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి భావ స్వాతంత్రం ఉంది. తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆ ఉద్దేశంతోనే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే ఏం చేసిందంటే.. పాలస్తీనా మారణ హోమంపై స్పందించింది. అందరూ షేర్ చేస్తున్న ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ఫొటోని తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.
అంతే.. దీనిమీద నెటిజన్లు భగ్గుమని లేచారు. మనదేశంలో ఇన్ని సమస్యలున్నాయి. కాశ్మీరి పండిట్ల మీద దాడులు జరుగుతున్నాయి. మణిపూర్ లో హింస జరిగింది. ఇలాంటివాటిపై ఎవరూ మాట్లాడరు. కానీ పరాయిదేశంలో ఏదైనా జరిగితే పెద్ద మానవతా వాదుల్లా ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఇలాంటి ధోరణి నశించాలి అంటూ రితికాపై సోషల్ మీడియాలో ఒక వర్గం దాడి మొదలుపెట్టింది. దీంతో కంగారుపడిన రితికా ఆ పోస్టుని డిలీట్ చేసింది. కానీ నెటిజన్లు మాత్రం వదిలిపెట్టలేదు.
Also Read : ఆ రోజులు తలచుకుంటే.. ఇప్పటికీ భయమేస్తుంది
ఇంతకీ విషయం ఏమిటంటే గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ చేస్తున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సురక్షిత ప్రాంతంగా చెప్పే రఫాలోని ఒక శరణార్ధి శిబిరంపై ఇజ్రాయిల్ దాడి చేసింది. అక్కడ తల దాచుకున్న 45 మంది అశువులు బాశారు. అందులో చిన్నపిల్లలు, తల్లులు, వృద్దులు ఎందరో ఉన్నారు. వారు మరణించిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
ఇవన్నీ చూసి చలించిపోయిన ఇండియన్స్ పలువురు పాలస్తీనా ప్రజలకు మద్దతుగా గళమెత్తారు. ఇందాక చెప్పినట్టుగా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఫొటోను షేర్ చేస్తున్నారు. దీంతో రోహిత్ శర్మ భార్య రితికా కూడా షేర్ చేసింది. దీంతో అందరినీ వదిలేసి నెటిజన్లు కొందరు రితికాపై దాడి మొదలుపెట్టారు.
పాలస్తీనాకు మద్దతు ప్రకటించిన సెలబ్రిటీల్లో కరీనా కపూర్, ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, అమీ జాక్సన్, పార్వతి, దుల్కర్ సల్మాన్, రష్మిక, మాళవిక, త్రిష, సమంత, దియా మీర్జా, రిచా చద్దా ఇలా పలువురు ఉన్నారు. వీరందరినీ వదిలేసి రోహిత్ శర్మ భార్యను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.