CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజముద్ర తుది రూపు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను గుర్తిచేసేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని సమాచారం. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 12 నమూనాలను తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతోపాటు పలువురు ఉద్యమకారులు, పార్టీ నేతలు, పలువురు అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
Also Read: సోనియాతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం!
అయితే, ప్రస్తుత చిహ్నంలో అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగాలను కొనసాగిస్తూ.. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్నిరోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పుల విషయాలను సూచించారు. ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి.. రుద్ర రాజేశం, డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫేసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ తోపాటు పలువురు ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. తుది రూపంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు.