Election commission vs YSRCP : ఏపీలో ఈసీ వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారింది. ఎన్నికల్లో ఓటమి భయమో.. లేక తాము అనుకున్న విధంగా పనులు జరగటం లేదనే ఫ్రస్టేషనో తెలియదు కానీ.. ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం.. ఎన్నికల సంఘంపై ఏదో రీతిన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. మరో అడుగు ముందుకేసిన వైసీపీ.. ఎన్నికల సంఘం బాబు వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యిందంటూ ఘాటు విమర్శలు చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈసీపై ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుండగా.. ఫ్యాన్ పార్టీ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
EVM ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఒక అడుగు ముందుకేసి.. ఎన్నికల కమిషన్ బాబు వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యిందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదన్న సజ్జల.. నిబంధనలకు విరుద్ధంగా CEC ఆదేశాలు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు..
మాచర్ల మాదిరే మిగతా చోట్లా EVM ధ్వంసం వీడియోలను ఈసీ ఎందుకు బయటపెట్టలేదనేది వైసీపీ ప్రశ్న. తమకు అన్యాయం జరిగిందని భావించాము కాబట్టే.. రీ పోలింగ్ అడిగామని.. టీడీపీ అలా ఎందుకు చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోవడం మండిపడ్డారు. ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదన్న వైసీపీ నేత.. బెట్టింగ్ల కోసమే.. సోషల్ మీడియాలో ప్రచారానికో తాము ప్రయత్నాలు చేయమని అన్నారు. ఉత్తరభారత దేశంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు.. సౌత్లో ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్న బీజేపీ.. ఆ రకంగా ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Also Read : ఆ దెబ్బతో ద్వారంపూడి ఓటమి ఫిక్స్! సేనాని పంతం నెగ్గే!
CSను తప్పించాలని కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. అధికారులను తమ దారికి తెచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ వీడియో అధికారిక వెబ్కాస్టింగ్ ద్వారా సేకరిస్తే..అది ఎన్నికల సంఘం ప్రత్యేక ఆస్తి అవుతుందని, అది ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. వీడియో ప్రామాణికతను తనిఖీ చేయకుండా EC ఎందుకు అంత తొందరగా స్పందించిందని ప్రశ్నించారు. మాచర్ల నియోజక వర్గంలో మొత్తం ఏడు EVMలు ధ్వంసం అయ్యాయని ఎన్నికల కమిషన్ అంగీకరించిన వాస్తవమైతే.. వాటిని పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా ఈసీ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. వీడియోలు బయటకు రాకుండా అడ్డుకోవడం ద్వారా దోషులను బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీలో వెసులుబాటు ఎందుకు ఇచ్చారని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని ఈసీని కోరామని ఆయన చెప్పారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఓట్ల లెక్కింపు రసాభాసగా మారే అవకాశం ఉందని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పని నియమావళిని ఏపీలో ఒక రాజకీయ పార్టీ అడిగిందని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన మాజీమంత్రి…నిష్పక్షపాతంగా.. ప్రశాంతంగా కౌంటిగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ.. సీఈఓ ఇచ్చిన నిబంధనలను వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది.
ఈసీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఏదో రూపంలో వైసీపీ నేతలు తప్పుబట్టడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. జగన్తో పాటు ఇతర నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. ఏం చేయాలో తెలియకే వరుసగా ఫిర్యాదు చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎవరెన్ని చేసినా.. విజయం తమదేనని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.