CM KCR: డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. కీలక సమయంలో సెషన్ జరగబోతుండటంతో చాలా ఆసక్తి నెలకొంది. మూడునెలల క్రితమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అప్పుడు 10 రోజుల పాటు సెషన్ జరపాలని ప్రతిపక్షాలు కోరినా.. రెండు రోజుల్లోనే మమా అనిపించారు. అలాంటిది, ఇప్పుడు మరోదఫా అసెంబ్లీ సెషన్ కు రెడీ కాబోతుండటం.. ఈసారి సుమారు వారం రోజుల పాటు ఉంటాయని తెలుస్తుండటం ఆసక్తికరం.
మంత్రి మల్లారెడ్డిపై సంచలన ఐటీ రైడ్స్ ముగిసిన వెంటనే.. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు రెడీ కావడం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని.. సుమారు 30 వేల కోట్లు కోత పెట్టిందంటూ.. అందుకే అసెంబ్లీ మీటింగ్ అంటూ లీకులిస్తున్నా.. అసలు ఉద్దేశం వేరే ఉందంటున్నారు. అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ కేంద్రాన్ని టార్గెట్ చేయడానికే ఈ సమావేశాలని అనుమానిస్తున్నారు. ఇప్పటికే సీబీఐని రాష్ట్రాంలోకి రాకుండా అడ్డుకున్న సర్కారు.. ఈసారి మరెంత సంచలన నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నడుస్తోంది.
ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీకి ఇదే చివరి సెషన్ అనే ప్రచారమూ వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారని.. బహుషా వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని అంటున్నారు. కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటితో పాటు తెలంగాణలోనూ ఎలక్షన్ నిర్వహించే విధంగా.. ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దును ఎంచుకున్నారని చెబుతున్నారు.
ఈసారి ముందస్తు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. కానీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో గులాబీ బాస్ ప్లాన్ మార్చేశారని అంటున్నారు. ఫాంహౌజ్ కేసు తర్వాత.. బీజేపీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలకు వల విసిరిన విషయం గుర్తించారు. పలువురు నేతలు పార్టీ మార్పుకు సై అన్నట్టు కూడా కేసీఆర్ దృష్టికి వచ్చింది.
ఇక, మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని బ్రదర్స్ లపై ఈడీ, ఐటీ పంజా విసిరిని తీరు చూస్తుంటే.. గులాబీ నేతల్లో భయం మొదలైంది. కేసీఆర్ తో ఉంటే తమ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయనే జాగ్రత్తతో.. అడిగితే చాలు కాషాయ కండువా కప్పేసుకునేందుకు పలువురు కీలక నేతలు మానసికంగా సిద్దమైపోయారని తెలుస్తోంది. ముందుముందు మరిన్ని దాడులు జరిగితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కవిత మెడకు చుట్టుకుంటే.. ఇక పార్టీ నుంచి వలసలను తాను సైతం ఆపలేననే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని టాక్. అందుకే, ఎందుకైనా మంచిదనే భావనలో.. మరో ఏడాది వరకూ ఆగకుండా.. ఈ ఫిబ్రవరిలోనే అసెంబ్లీ రద్దు చేసేసి.. ఎన్నికలకు వెళ్లాలనేది కేటీఆర్ ప్లాన్ అంటున్నారు. అందుకే ఇదే చివరి అసెంబ్లీ సెషన్ అంటూ ప్రచారం జరుగుతోంది.