Who Will Win in Kondapi Assembly Constituency: ఎన్నికల్లో హ్యాట్రిక్స్ సాధించబోతున్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే ధీమాగా చెబుతుంటే.. అంత సీన్ లేదని ఆయన ప్రత్యర్థి చెబుతున్నారు. ఎన్నికల్లో విజయంపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఆ స్థానంలో 10వేల మెజార్టీతో విజయం తమదేనని తెలుగుతమ్ముళ్లు చెబుతుండగా.. ఈసారి సీట్ మాదేనని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మైనస్, ప్లస్లు అంటూ లెక్కలతో నేతలు బిజీగా మారారు. ఇంతకీ.. ఏమిటా నియోజకవర్గం. అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్పాయి. కొండపి.. ప్రకాశం జిల్లాలో కీలకమైన ఎస్సీ రిజ్వర్వుడ్ నియోజకవర్గం. ఇక్కడ YCP అభ్యర్ధిగా మంత్రి ఆదిమూలపు సురేష్, తెలుగుదేశం అభ్యర్ధిగా డోలా బాలవీరాంజనేయస్వామి బరిలో ఉన్నారు. ఎన్నికల జరిగాక రిజల్ట్పై ఉత్కంఠ నెలకొంది. కానీ.. ఇద్దరు నేతలూ తగ్గడం లేదు. విజయం తమదేనంటూ ఇరువురూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించినట్లే… ఈసారీ రిపీట్ చేస్తామని టీడీపీ చెబుతుంటే.. వైసీపీ చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలే తమకు శ్రీరామరక్ష అని వైసీపీ భావిస్తోంది. దీంతో.. అక్కడ ఎవరు గెలుస్తారనే అంశంపై సస్పెన్స్
1955లో ఏర్పడిన కొండపి నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్ హవా నడించింది. 1982 తర్వాత సీన్ మారింది. తెలుగుదేశం పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉంటే.. 28 చోట్ల వైసీపీ గెలిచింది. కొండపిలో మాత్రం టీడీపీ హవాకు అడ్డకట్ట వేయలేకపోయింది. రాష్ట్రంలో ఫ్యాన్ హవా ధాటికి హేమాహేమీలు ఓటమి పాలవగా.. బాలవీరాంజనేయస్వామి మాత్రం గెలిచి సత్తా చాటుకున్నారు. రెండు సార్లు విజయం సాధించిన ఆయన.. హ్యట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు.
మరికొన్నిరోజుల్లో ఎలక్షన్ ఫలితాలు వెల్లడయ్యే నేపథ్యంలో కొండపి నియోజకవర్గంలో పరిస్థితి ఏంటనే ఉత్కంఠ.. నెలకొంది. ఈసారి అక్కడ గెలవటం అంత ఈజీ కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, కొండెపి, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు ఉన్నాయి. వీటిలో.. కొండపి, జరుమల్లి, టంగుటూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లో మాత్రం వైసీపీకి ఎడ్జ్ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సింగరాయకొండ మండలంలో మాత్రం ఓటర్లు పరిస్థితులకు అనుగుణంగా.. ఏదో ఒక పార్టీ వైపు నిలుస్తూ విజేతలను నిర్ణయిస్తారనే వాదన ఉంది. సో.. ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ.. సర్వత్రా నెలకొంది.
Also Read: పలమనేరులో పాగా.. టీడీపీ కంచుకోటలో వైసీపీ పవర్ ఎంత?
కొండపి SC రిజర్వుడు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓటర్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. వారి ఆశీసులు ఎవరికి ఉంటే..వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామికి సొంత చరిష్మా ఉండటం.. టీడీపీకి కలిసివచ్చే అవకాశంగా కనిపిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ అభ్యర్ధి ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి.. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించే అవకాశాలున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పైగా.. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో ఎలాంటి గ్రూపులు కానీ.. అసమ్మతి కానీ.. లేకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కమ్మ సామాజికవర్గం ఆశీస్సులు పుష్కలంగా ఉండటం ఎమ్మెల్యేకు ప్లస్ పాయింట్స్గా చెబుతున్నారు. దివంగత నేత దామచర్ల ఆంజనేయులు మనవడైన దామచర్ల సత్యా అండదండలు ఉండటం ఎమ్మెల్యే స్వామికి కలిసివచ్చే అంశంగా తెలుస్తోంది. పైగా ఆయన నియోజకవర్గంనికి లోకల్ కావటం ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యే పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. దీంతో.. ముచ్చటగా మూడోసారి గెలుస్తానని బాలవీరాంజనేయ స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు..మొదటి నుంచి కొండపి నియోజకవర్గం వైపీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. వైసీపీ ఆవిర్భావం తరువాత ఇక్కడ పోటీ చేసిన రెండుసార్లూ…ఆ పార్టీ అభ్యర్దులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ రెండోసారి ఓడిపోయిన తరువాత కొన్నాళ్లు ఇన్ఛార్జ్గా ఉన్న మాదాసి వెంకయ్య స్థానంలో వరికూటి అశోక్బాబును నియమించారు. ఆయనకు కూడా సొంతపార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం రావటంతో నియోజకవర్గాల మార్పుచేర్పుల కారణంగా అశోక్బాబును బాపట్ల జిల్లా వేమూరుకు పంపించి కొండపిలో మంత్రి ఆదిమూలపు సురేష్ను రీప్లేస్ చేశారు. ఈ నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ధులు వరుసగా పరాజయం పాలయ్యారు. TDP ఆవిర్భావం నుంచి ఇక్కడ కాంగ్రెస్ నాలుగు సార్లు, టీడీపీ నాలుగుసార్లు విన్ అయ్యాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండుసార్లూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వడుగా మారింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 34 వేల 675 మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే.. కమ్మ ఓటర్లు అధికంగా ఉన్నారు. అంటే దాదాపు 43 వేల ఓట్లు కలిగిన కమ్మ సామాజికవర్గం..ఇక్కడ డిసైడింట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. తర్వాత స్థానంలో మాల సామాజికవర్గానికి చెందిన 38 వేలమంది. 29 వేల ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గం మూడోస్థానంలో ఉంది. అలాగే.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన 25 వేల మంది ఓటర్లు, యాదవులు 16 వేలు, బలిజ సామాజికవర్గం 3 వేల ఓట్లు ఉండగా.. ముస్లింలు 3 వేలు, ఆర్యవైశ్య సామాజికవర్గం ఓటర్లు మూడు వేలు ఉన్నారు. మిగిలిన వారు.. బీసీ సామాజిక వర్గంలోని ఉపకులాలకు చెందిన వారు. వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒకవైపు ఉంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత మరో అంశం. ఈ నేపథ్యంలో ఫలితం ఎలా ఉండబోతుందనేది సస్పెన్స్గా మారింది.
వైసీపీలోనూ కొన్ని మైనస్లు ఉన్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఆదిమూలపు సురేష్ పోటీ చేసిన ప్రతిసారీ అసెంబ్లీ స్థానం మారుస్తూనే వస్తున్నారు. నాలుగోసారి పోటీ చేస్తున్న కొండపి స్థానం కూడా ఇలా మార్చిందే. అయితే కొండపి స్థానంలో ఈసారి ఆదిమూలపు సురేష్.. రెండువేల ఓట్లతో గెలవబోతున్నట్లు ఆ పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇదే విషయాన్ని సురేష్ కూడా కొందరి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పెద్దస్థాయిలో మెజార్టీ రాకున్నా… గెలుపు మాత్రం గ్యారెంటీ అనే ధీమాలో ఆయన ఉన్నట్లు సమాచారం. మంత్రి సురేశ్ ఆర్ధికంగా బలంగా ఉండటంతో… ఎన్నికల్లో ఖర్చు అంతా ఆయనే భరించారని టాక్. టంగుటూరు, పొన్నలూరులో వైసీపీ ఓటర్లకు అందించే తాయిలాలు సక్రమంగా అందలేదనే వాదన బలంగా వినిపించింది. ఎన్నికల తర్వాత సింగరాయకొండలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కొందరు ఓటర్లు, నేతలూ… ఇదే అంశంపై సురేష్పై ఫైర్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: పుష్ప పవర్ ఎంత? శిల్పా లెక్క మారిందా?
మరోవైపు.. ఎన్నికల విజయంపై సురేశ్ అదృష్టాన్ని నమ్ముకున్నారట. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో గెలిచి.. కొండెపిలో TDP కోటను బద్దలు చేయడం ఖాయమనే ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సీటు మార్పు అంశం ఎలాగూ తనకు కలసి వస్తుందనే సెంటిమెంట్తో ఆయన ఉన్నట్లు టాక్. ఒకరేమే.. హ్యాట్రిక్ పక్కా అంటుంటే.. మరొకరు మాత్రం టీడీపీ కంచుకోటను బద్ధలు కొడతామని చెబుతున్నారు. అసలు.. కొండపి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టరనేది మరికొన్ని రోజుల్లో వెల్లడికానుంది.