Dera Baba got Big Relief in Ranjit Singh Murder Case: డేరా సచ్చా సౌదా చీఫ్, ప్రముఖ వివాదాస్పద మత గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు రంజిత్ సింగ్ హత్యకేసులో భారీ ఊరట లభించింది. ఈ హత్యకేసులో ఆయన్ను పంజాబ్ – హర్యానా హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. డేరా బాబాతో పాటు మరో నలుగురిని కూడా ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించింది. తన మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకేసులో తనకు విధించిన శిక్షపై గుర్మీత్ రామ్ రహీమ్ దాఖలు చేసిన అప్పీల్ ను జస్టిస్ సురేష్ వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన డివిజన్ బెంచ్ పరిశీలించింది.
రంజిత్ సింగ్ హత్యకేసులో నిందితులుగా పేర్కొన్న అవతార్ సింగ్, క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్ లలో ఒకరు విచారణ సమయంలో మరణించారు. అక్టోబర్ 18, 2021న ఈ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, నలుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే డేరా చీఫ్ అయిన గుర్మీత్ కు రూ.31 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్షలను సవాల్ చేస్తూ డేరా బాబా పంజాబ్ – హర్యానా హై కోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పాటు జర్నలిస్ట్ ఛత్రపతి హత్యకేసులో ఆయన వేసిన అప్పీల్ పెండింగ్ లో ఉంది.
ప్రస్తుతం గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రోహ్ తక్ లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసుల్లో గుర్మీత్ 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ కేసుల్లో మాత్రం కోర్టు ఎలాంటి నిర్ణయాన్నీ వెల్లడించలేదు.
Also Read: లైంగిక వేధింపుల కేసు.. ఆ రోజు సిట్ ముందు హాజరవుతా : ప్రజ్వల్ రేవణ్ణ
డేరా బాబా ఆశ్రమంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వచ్చి ఒక లేఖ తీవ్ర కలకలం రేపింది. ఆ లేఖ తన అనుచరుడు, మేనేజర్ గా ఉన్న రంజిత్ సింగ్ రాసి ఉంటాడన్న అనుమానంతో డేరా బాబానే 2002లో చంపినట్లు సీబీఐ పేర్కొంది. లైంగిక వేధింపులపై వచ్చిన లేఖ దేశమంతా కలకలం రేపడంతో.. రంజిత్ సింగ్ ను గుర్మీత్ కుట్ర ప్రకారం కాల్చి చంపినట్లు రుజువైనట్లు సీబీఐ కోర్టు పేర్కొంది. కాగా.. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడంతో.. 2017లో ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్షపడింది.