Hyderabad Realtor Murdered in Bangalore: హైదరాబాద్ కు చెందిన ఓ బిల్డర్ కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. బిల్డర్ మధును అతని స్నేహితుడైన రేణుకా ప్రసాదే చంపినట్లు పోలీసులు నిర్థారించారు. తలపై బండరాయితో కొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక మన్నేకెళ్లి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బిల్డర్ కుప్పాల మధు (48).. రియల్ ఎస్టేట్ తో పాటు ట్రావెల్స్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కూతుర్లు అలేఖ్య, అఖిలలతో కలిసి జీడిమెట్ల కల్పన సొసైటీలో ఉంటున్నాడు. వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్ కు వెళ్లేవాడు. ఈ నెల 24న కూడా బీదర్ కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. తనతో పాటు తన స్నేహితుడు చింతల్ కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్ధార్థరెడ్డిని కూడా తీసుకెళ్లాడు.
అదే రోజు రాత్రి భార్య ఫోన్ చేయగా హైదరాబాద్ కు వస్తున్నట్లు చెప్పాడు. గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తెల్లవారినా ఇంటికి రాలేదు. 25న ఉదయం.. మన్నేకెళ్లి పీఎస్ పరిధిలో రోడ్డుపక్కన ఆపి ఉన్న కారు వద్ద మృతదేహం లభించింది. కారు నంబర్ ఆధారంగా ఆ మృతదేహం మధు అని గుర్తించారు. వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారమివ్వగా.. వారు మధు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
Also Read: దారుణం.. నరికి చంపుతున్నా చుట్టున్న జనాలు ఎవరూ ఆపలే..!
కాగా.. మధు శరీరంపై ఉండాల్సిన రూ.6 లక్షల విలువైన బంగారం, పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. తొలుత వీటికోసమే నిందితులు హత్య చేసినట్లు భావించారు. కానీ.. మధుని హత్య చేసింది స్నేహితుడు రేణుక ప్రసాదేనని తేలింది. మధుకు రేణుక ప్రసాద్ గ్యాంగ్ క్యాసినో గేమ్ లో పరిచయమైంది. మధు కూతురిపై రేణుక కన్నుపడింది.
క్యాసినో ఆటలో ఇద్దరికి ఉన్న స్నేహంతో చనువుగా ఉన్న రేణుక ప్రసాద్.. తనకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని అడిగాడు. ఇద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేయాలని కోరాడు. అందుకు మధు ఒప్పుకోకపోవడంతో.. కక్ష పెంచుకున్నాడు. మధు హత్యకు హైదరాబాద్ లోనే ప్రణాళిక రచించాడు. టైమ్ చూసి.. క్యాసినో ఆడుదాం రమ్మంటూ బీదర్ కు తీసుకెళ్లి చంపేసినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. ఆయనకు రూ.200 కోట్ల ఆస్తి ఉంటుందని పేర్కొన్నారు.