Update on Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పలు సంచన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సిబ్బంది, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలువురు మీడియా యజమానుల ఫోన్లు, వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు కిషన్ రావు పేర్కొన్నారని సమాచారం. గద్వాల, కోరుట్ల, మానకొండూరుకు చెందిన విపక్ష నేతల ఫోన్లు, అదేవిధంగా కన్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామంటూ రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఫోన్ ట్యాపింగ్ విషయమై పలువురు నేతలు మాట్లాడారు. ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గం అని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. రాజకీయ స్వార్థం కోసం అడ్డదారులు తొక్కిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. రాజయ్య బర్తరఫ్తో ఈ విషయం కన్ఫామ్ అయిందని గుర్తుచేశారు. చరిత్ర హీనుడుగా కేసీఆర్ మిగిలిపోతారని అన్నారు.
Also Read: జూన్ 2న ట్యాంక్ బండ్ పై కార్నివాల్: సీఎస్
ఫోన్ ట్యాపింగ్ అంశం దేశభద్రతకు సంబంధించిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిజంగానే ట్యాపింగ్కు పాల్పడితే వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. అయితే.. ఈ అంశాన్ని ఎవరూ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడనని ఆర్ఎస్పీ చెప్పారు.
కేసీఆర్ హయాంలో రాక్షస రాజ్యం నడిచిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘వ్యాపారులు, సినిమా వాళ్ల ఫోన్లనూ ట్యాప్ చేశారు. ఎమ్మెల్సీ నవీన్ కు ఇందులో భాగస్వామ్యం ఉంది. కేసీఆర్ వ్యక్తుల స్వేచ్ఛను హరించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందులో కాంగ్రెస్ నేతలున్నా క్షమించేది లేదు’ అని అన్నారు.