Swathi maliwal Cried in Court: ఆప్ ఎంపీ స్వాతిమలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే ఈకేసు విచారణ కోసం ఎంపీ స్వాతి మలివాల్ కోర్టుకు హాజరయ్యారు.
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్నిరిజర్వ్లో పెట్టింది. అయితే పిటిషన్పై బిభవ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టులో కౌరవులు, ద్రౌపతి గురించి ప్రస్తావించారు. అయితే కోర్టు విచారణ సమయంలో స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. బిభవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లపై ఆమె అభ్యంతరం తెలిపారు. అనంతరం ఆమె బిభవ్పై ఐపీసీ 308 కేసు నమోదు చేసినా ప్రయోజనం లేదన్నారు.
సీఎం నివాసానికి స్వాతి మలివాల్ను ఎవరూ పిలవలేదని.. పక్కా పథకం ప్రకారమే ఆమె అక్కడికి వచ్చిందని.. అంతే కాకుండా ఆమె బిభవ్ గురించి సిబ్బందిని అడిగిందని బిభవ్ తరపు న్యాయవాది తెలిపారు. ఆమెకు ఎలాంటి సమస్య లేదని నిజంగానే ఆమెపై దాడి జరిగి ఉంటే అదే రోజు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మూడు రోజుల తర్వాత ఆమె ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని తెలిపారు. స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా కొనసాగుతున్నారని బిభవ్ తరపు న్యాయవాది వెల్లడించారు.
Also Read: ‘నాకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి’
స్వాతి మలివాల్ హక్కులకు భంగం కలిగితే ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసు అని అన్నారు. ఇదిలా ఉంటే బిభవ్ తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై ఏడు ఎనమిది సార్లు కొట్టడంతో పాటు కడుపులో తన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో ఈ నెల 18న బిభవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.