Stage Caves in as Rahul Gandhi: బీహార్లో ఇండియా కూటమి పలిగంజ్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన స్టేజ్ మీదికి వస్తున్న సయయంలో స్టేజ్ పాక్షికంగా కిందకి ఒరిగింది. తేజస్వీ యాదవ్తో కలిసి రాహుల్ స్టేజ్ మీదకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రాహుల్కు సాయం చేయబోయారు. అయితే తాను బాగానే ఉన్నానని సెక్యూరిటీకి సర్ది చెప్పిన రాహుల్.. ఆ తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
బీహార్ లో ఇండియా కూటమి బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాలేరని, దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి మద్దతు ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అగ్నిపథ్ ను రద్దు చేస్తామని మరోసారి చెప్పారు. 2022లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో అగ్నివీరులుగా పిలిచే యువ సైనికులను నాలుగేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారని, వారిలో 75 శాతం మందికి సైనిక ప్రయోజనాలు ఉండవన్నారు.
ప్రధాని మోదీ.. దేశాన్ని రక్షించాల్సిన సైనికులను కార్మికులుగా మార్చారని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఒక సైనికుడు గాయపడినా, అమరుడైనా అతనికి లభించాల్సిన పరిహారం, హోదా ఇవ్వడం లేదని, ఎందుకీ వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. తనను తాను దేవదూతగా చెప్పుకునే మోదీ.. జూన్ 4 తర్వాత అవినీతి గురించి ఈడీ ప్రశ్నిస్తే.. తనకేమీ తెలియదని, తనను దేవుడే పంపాడని చెబుతారని విమర్శించారు.
Also Read: Pandemic: ప్రపంచ దేశాలకు హెచ్చరిక.. రాబోతున్న మరో సంక్షోభం ?
అనంతరం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. విభజన వాక్చాతుర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, హామీలను నెరవేర్చడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. బీహార్ ప్రజలు తమతో చెప్పిన అబద్ధాలకు, హిందూ-ముస్లిం చర్చలకు ప్రతీకారం తీర్చుకుంటారు. ఇక్కడి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ప్రధాని నోరు మెదపలేదని దుయ్యబట్టారు.