Two Thousand People Buried Alive in Papua New Guinea: పాపువా న్యూగినీలో ఈ నెల 24న ఎంగా ప్రావిన్స్ లోని యంబాలి గ్రామంపై మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. తొలిరోజు సుమారు 100 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ.. ఆదివారానికి మృతుల సంఖ్య 670కి చేరినట్లు వెల్లడించారు. తాజాగా.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మంది సజీవ సమాధి అయినట్లు పాపువా న్యూగినియా దేశ జాతీయ విపత్తు సంస్థ పోర్ట్ మోరెస్బీలో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి తెలిపింది.
సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండచరియలు విరిగిపడగా.. ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పకూలాయి. కొండచరియలు విరిగిపడిన సమయంలో ప్రజలు నిద్రలో ఉండటంతో.. పెను ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. భవనాలు కుప్పకూలాయి. ఈ విధ్వంసం ఆ దేశ ఆర్థిక జీవనరేఖపై పెను ప్రభావాన్ని చూపింది.
Also Read: Terrible Road Accident: ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి
అక్కడ పోర్గెరా మైన్ కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కూడా ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఘోర విపత్తును ఎదుర్కొన్న తమకు అందరూ సహాయ, సహకారాలు అందించాలని సైన్యం, ప్రజలను కోరింది ప్రభుత్వం. పాపువా న్యూ గినియాలో పరిస్థితి గురించి అంతర్జాతీయంగా అందరికీ తెలిసేలా చెప్పాలని, ఇది ఆదుకోవాల్సిన సమయమని పేర్కొంది.