Narasaraopet Assembly Constituency: నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ హ్యాట్రిక్ సాధించనుందా? లేక.. అరవింద్బాబు చెబుతున్నట్లు ఈసారి టీడీపీ జెండా ఎగరనుందా? నియోజకవర్గంలో ఊహించని విధంగా జరిగిన ఘర్షణలు.. ప్రస్తుతానికి సీటు విజయంపై మరింత హైప్ను క్రియేట్ చేశాయి. అసలు.. అక్కడ గెలుపు ఓటమిల పరిస్థితి ఎలా ఉంది. పేటలో పాగా వేసేదెవరు? వాచ్ దిస్ స్టోరీ.
పల్నాడు జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా నరసరావుపేట అసెంబ్లీ స్థానం ఉంది. నియోజకవర్గంలో గతంలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉండేది. పదేళ్లుగా YCP అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండుసార్లు కూడా కీలకమైన పరిస్థితుల్లో గోపిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగిన నేపథ్యంలో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి.. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు గట్టి పోటీ ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఇరుపార్టీలూ సీటు మాదంటే మాదంటూ చెప్పుకొంటున్నారు.
ఏపీలోనే కీలకమైన నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారనే దానిపై భారీఅంచనాలు ఉన్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ఇరుపార్టీల నేతలూ ధీమాతో ఉన్నారు. నేతలతో పాటు జనాల్లోనూ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు కూడా రెచ్చిపోయి పందేలు కాసేస్తున్నారట. ఎన్నికల సరళి ముగిసిన నేపథ్యంలో జరిగిన ఘర్షణలు కూడా..నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంపై భారీ అంచనాలను పెంచిన పరిస్థితి. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనే అంశం తెలుగుప్రజల్లో ఉత్కంఠగా మారింది.
Also Read: Nandyal Assembly Constituency: పుష్ప పవర్ ఎంత? శిల్పా లెక్క మారిందా?
నరసరావుపేట నియోజకవర్గంలో ఎవరు ఊహించని విధంగా ఈసారి తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఒక టైమ్లో నరసరావుపేట అల్లకల్లోలంగా అయిపోతుందా అనే పరిస్థితి కనపడింది. ఒకరిపై ఒకరు దాడులు.. వాహనాలు ధ్వంసం సహా అక్కడ పరిస్థితి పోలీసులకూ సవాల్గా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్ అమలు చేయాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. భయంకరమైన దృశ్యాలు చూస్తే.. అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడులు గానీ.. అరవింద్ బాబుపై జరిగిన దాడులు గానీ చూస్తే.. అసలు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఎన్నికలు ముగిసిన తర్వాతైనా ప్రశాంత వాతావరణం కనిపిస్తుందేమో అనుకున్నారు. కానీ.. తర్వాత పరిణామాలు కూడా నరసరావుపేటలో రణరంగాన్నే తలపించాయి. రబ్బర్ బుల్లెట్లతో.. పోలీసులు.. ఘర్షణల్ని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది.
నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో విజయావకాశాలపై ఇరుపార్టీల నేతలకూ ప్రత్యేక లెక్కలు ఉన్నాయట. అధికారంలో ఉండగా నరసరావుపేటలో జరిగిన అభివృద్ధి తమకు కలసి వస్తుందనే ధీమాలో టీడీపీ ఉంది. దాంతోపాటు అభ్యర్థి అరవింద్బాబు.. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావటంతో తెలుగుతమ్ముళ్లు విజయం తమదేనంటున్నారు. అరవింద్ బాబు కూడా ప్రజల్లో ఉంటూ.. స్థానిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ తమకు కలిసొస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి కూడా తమదే విజయం అంటున్నారు. తన హాయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలూ తప్పక వైసీపీకి విజయాన్ని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?
సామాజిక వర్గాల వారీగా చూస్తే..నరసరావుపేట నియోజవర్గంలో రెడ్డి కులానికి చెందిన ఓట్లు కీలకంగా మారనున్నాయి. వీటితో పాటు సెగ్మెంట్లోని బీసీ ఓట్లు గానీ.. కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకమనే చెప్పొచ్చు. వీటితోపాటు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఓటర్లు కూడా ఇక్కడ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వీరే… ఇక్కడ డిసైడింగ్ ఫాక్టర్గా ఉన్నారు. ఎన్నికల్లో పోలైన ఓట్లకు తోడుగా రెడ్డి సామాజికవర్గం ఓట్లూ తోడైతే.. విజయం నల్లేరుపై నడకేనని వైసీపీ భావిస్తుంది. దళితుల ఓట్లు కూడా తమ పార్టీకే పడితే.. భారీ మెజార్జీ ఖాయమనే భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.
కమ్మ సామాజిక వర్గం ఓట్లు తప్పకుండా తమ వైపు ఉంటాయని టీడీపీ భావిస్తోంది. దీంతో పాటు బీసీ నేత అయిన అరవింద్బాబుకి తప్పకుండా ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ పడే అవకాశముందనే అంచనాలో తెలుగుదేశం ఉంది. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు..తప్పకుండా కూటమి అభ్యర్థి అరవింద్బాబుకి విజయావకాశాన్ని తెచ్చి పెడతాయనే లెక్కలతో తెలుగుదేశం నేతలున్నారు. నరసరావుపేట ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: Palamaner Assembly Constituency: పలమనేరులో పాగా.. టీడీపీ కంచుకోటలో వైసీపీ పవర్ ఎంత?
నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనూ అదే ప్రభావం కనిపిస్తే తప్పకుండా టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే…. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోయే పరిస్థితులు.. ప్రస్తుతానికి కనిపించడం లేదనేది కూడా విశ్లేషకుల అంచనా. స్థానికంగా ఆయనకున్న పట్టు.. పోల్ మేనేజ్మెంట్లో ఆయన అనుచరులు చేసిన వ్యూహాలు వైసీపీ విజయానికి దోహదం చేస్తాయనే వాదనలూ ఉన్నాయి. సామాజిక సమీకరణాల్లో కీలకమైన ఓటుబ్యాంకు అంతా గోపిరెడ్డి వైపు చూస్తూ.. ఆయన గెలుపు ఖాయమనేది అధికార పార్టీ నేతల భావనగా కనిపిస్తోంది.
ఏది ఏమైనా.. ఈసారీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ఎమ్మెల్యే గోపిరెడ్డి అంటుంటే.. వైసీపీ అభ్యర్థిని మట్టి కరిపించి.. నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగురవేస్తామని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గెలుపుపై అరవింద్బాబు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.