CM KCR : మంత్రి మల్లారెడ్డి మీద ఐటీ రైడ్స్. రెండున్నర రోజుల పాటు సోదాలు. 30 కోట్ల నగదు, 15 కిలోల బంగారం సీజ్. తెలంగాణలో ఇంతకు ముందెప్పుడూ కనీవినీ చూడని దాడులు. మల్లారెడ్డి అనే కాదు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర టార్గెట్ గా గ్రానైట్ కంపెనీలపై ఈడీ రైడ్స్.. తలసాని బ్రదర్స్ ను కేసినో కేసులో ప్రశ్నించడం, గతంలో ఎంపీ నామానాగేశ్వరరావు ఆస్తులపై దాడులు.. ఇలా వరుసబెట్టి ఊపిరి సలపకుండా తెలంగాణ ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు.
ఇంత జరుగుతుంటే.. మల్లారెడ్డి ఆస్తులపై అంత పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ జరిగితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసలేమాత్రం స్పందించక పోవడం ఆసక్తికరంగా మారింది. పదే పదే ప్రెస్ మీట్లు పెడుతూ, కేంద్రాన్ని బీజేపీని ఏకిపారేసే కేసీఆర్.. ఈసారి ఇంత పెద్ద డ్యామేజ్ జరిగినా సైలెంట్ గా ఉండటంపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనే కాదు.. పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నోరు మెదపకపోవడం అర్థంకాని విషయం. ప్రతీ దానికీ ట్వీట్లు చేసే కేటీఆర్.. మల్లారెడ్డిపై ఐటీ దాడుల విషయంలో ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం వెనుక మతలబేంటి?
మల్లారెడ్డి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి తన వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారంటూ.. జై బీఆర్ఎస్ అంటూ ఆయన స్టైల్ లో ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ.. మల్లారెడ్డికి ఫోన్ చేసి ఓదార్చి, ధైర్యం చెప్పినట్టు కానీ.. ఎక్కడా న్యూస్ లేదు. స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్ మినహా మల్లారెడ్డిని పార్టీ నేతలెవరూ కలవనేలేదు. ఎందుకు? అసలేం జరుగుతోంది? భయమా? వ్యూహమా?
మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు స్పందించలేదంటే వారు భయపడి ఉండొచ్చని అనుకోవచ్చు. ఎక్కడ మల్లారెడ్డికి మద్దతుగా మాట్లాడితే.. తమపై కూడా ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయోననే జాగ్రత్త ఉండొచ్చు. కానీ, కేసీఆర్, కేటీఆర్ లకు ఏమైంది? వారెందుకు మౌనంగా ఉన్నారు? సీఎం కేసీఆర్ ఎప్పటిలానే మీడియా సమావేశం పెట్టి.. దుమ్ముదులిపేయొచ్చుగా? ఎందుకలా చేయలేదు? కనీసం ప్రభుత్వం, పార్టీ తరఫున ఓ ప్రకటన కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.
కేసీఆర్ ముందే ఊహించారు.. దాడులు జరుగుతాయని నేతలను ముందే హెచ్చరించారు.. కాబట్టే ఇప్పుడేమీ స్పందించలేదని అనుకోలేం. మల్లారెడ్డితోనే దాడులు ఆగిపోవని.. మరికొందరిపైనా నజర్ ఉందని తెలిసి.. అవన్నీ అయిపోయాక తీరిగ్గా తిడదాంలే అనుకునే ఛాన్స్ కూడా లేదు. మరెందుకీ మౌనం?
ఢిల్లీ లిక్కర్ స్కామే ఆయన నోరు కట్టేస్తోందని అంటున్నారు. ఈడీ దూకుడు పెంచి లిక్కర్ స్కాం విచారణ కవిత వరకూ వస్తే.. అప్పుడు తాడోపేడో తేల్చుకుందాంలే అనే ధోరణిలో కేసీఆర్ ఉన్నారని కొందరు అంటున్నారు. మంత్రి మల్లారెడ్డిపై ఏ రేంజ్ లో దాడులు జరిగాయో చూశాక.. మేటర్ ఇంత సీరియస్ గా ఉంటే.. ఇప్పుడే తీవ్ర కవ్వింపు చర్యలకు పోకుండా కాస్త సంయమనం పాటించాలని కేసీఆర్ భావిస్తున్నారా? అనే అనుమానం. లేదంటే, అసెంబ్లీ సమావేశాల్లోనే కేంద్రాన్ని స్ట్రాంగ్ గా కౌంటర్ చేసేలా.. కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇదంతా తుఫాను ముందు ప్రశాంతత అనుకోవచ్చా? ఇలా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్, కేటీఆర్ ల మౌనం చూసి పార్టీ నేతలు మాత్రం బెదిరిపోతున్నారు. బాసే సైలెంట్ గా ఉంటుంటే.. ఇక తమ పరిస్థితి ఏంటంటూ.. ఎందుకైనా మంచిదనుకుంటూ.. గులాబీ దళం సర్దుకుంటోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో వేచి చూస్తోంది…