Rain forecast for AP, Telangana: వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నది.
బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెమాల్ తుఫాను ఉధృతంగా మారి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్నది. ఆ తీవ్ర తుఫాను అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశముందని.. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో భారీగా సుమారు 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెమాల్ తుఫాను ఉధృతంగా మారి తీవ్ర తుఫాను కొనసాగుతున్న క్రమంలో బెంగాల్ లోని తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్యం రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొన్నది. అదేవిధంగా ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా, నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలి ఉన్న భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి.
Also Read: నాకైతే నమ్మకం లేదు.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు
ఆదివారం వరకు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ తరువాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.