Swati Maliwal: ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. దీని ద్వారా తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాథీ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. వీడియోలు పోస్టు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు.
నా పార్టీకి చెందిన నేతలు అసత్య ప్రచారం చేయడం వల్ల నాకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయి. యూట్యూబర్ ధ్రువ్ రాథీ సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో బెదిరింపులు మరింత తీవ్రం అయ్యాయి. స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకునే అతడి లాంటి వ్యక్తులు కొందరు ఆప్ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. అన్ని వైపుల నుంచి ప్రస్తుతం నేను అసత్య ప్రచారాలు ఎదుర్కుంటున్నాను అని మాలివాల్ ఎక్స్ ఖాతాలో ఆదివారం పేర్కొన్నారు.
Also Read: నక్కి తగ్గేది లేదన్న స్వాతి మలీవాల్.. ఆపై ఎంపీ సీటుకు..!
తాను ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి పార్టీ నాయకత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మహిళల సమస్యలపై వారు ప్రవర్తిస్తున్న తీరుకు నిదర్శనం అన్నారు. తనకు వచ్చే బెదిరింపులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మే 13న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో మాలివాల్ పై జరిగిన దాడి కేసులో బిభవ్ కుమార్ ను పోలీసులు మే 18న అరెస్ట్ చేశారు. కాగా బిభవ్ బెయిల్ కోరుతూ శనివారం స్ధానిక కోర్టును ఆశ్రయించాడు.