Aadhaar Card: ప్రస్తుతం దేశంలో ఎక్కడ జీవించాలన్న ఆధార్ ఉంటే చాలు. అన్నీ సులభంగా జరిగిపోయేలా మారిపోయింది. అయితే అన్నిటికి మూలంగా మారిన ఈ ఆధార్ గురించి నెట్టింట ఓ చర్చ జరుగుతోంది. వచ్చే నెల అంటే జూన్ 14 నుంచి ఆధార్ కార్డు పని చేయదంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై యూఐడీఏఐ తాజాగా స్పందించింది. ఆధార్ పని చేయదంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలని పేర్కొంది.
జూన్ 14 వ తేదీలోపు ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి మాత్రమే చివరి గడువుగా ఉందని స్పష్టం చేసింది. అయితే ఆధార్ లో వివరాలను జూన్ 14వ తేదీలోపు మార్చుకోకపోయినా కూడా ఆధార్ కార్డు పనిచేస్తుందని తెలిపింది. దీనికి ఆధార్ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి వివరాలను మార్చుకోవచ్చని సూచించింది. కాగా, ఇప్పటికే ఆన్ లైన్ లో ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు 2023 డిసెంబర్ 14వ తేదీతో ముగియడంతో.. దానిని జూన్ 14, 2024 వరకు యూఐడీఏఐ పొడిగించిన విషయం తెలిసిందే.
ప్రతీ పదేళ్లకు ఒకసారి ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. దీనికి గుర్తింపు కార్డు, చిరునామా వంటి పత్రాలను సమర్పించి మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉడాయ్ వెబ్ సైట్ ద్వారా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను వెబ్ సైట్లో సబ్మిట్ చేస్తే ఆధార్ అప్డేట్ అవుతుంది. దీని కోసం రేషన్ కార్డు, కిసాన్ పాస్ బుక్, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ వంటివి ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగించుకోవచ్చు.