Minister Uttam Kumar Reddy Slams KTR, Elleti: ‘నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోను’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేశ్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను మిల్లర్లపై చర్యలు తీసుకుంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాలు, తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. అయితే, సన్నబియ్యం కొనడంలేదని ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు. రూ. 42కు సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తదని మంత్రి తెలిపారు. అదేవిధంగా సన్నిబియ్యంపై ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, దీనిపై టెండర్ పెట్టి రద్దు చేశామని ఆయన చెప్పారు.
ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే, గత ప్రభుత్వంలో క్వింటా ధాన్యాన్ని రూ. 1700 తీసుకునేదని.. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్వింటా ధాన్యంకు రూ. 2007 చెల్లిస్తుందన్నారు. దీంతో రైతులకు రూ. 1,100 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు.