Good news : ఉద్యోగులంతా త్వరలో ఓ శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ప్రభుత్వం త్వరలో ఓ ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు. అది… పెన్షన్ స్కీమ్కు సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి పెంపుపై ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్న వేతన పరిమితిని ప్రభుత్వం త్వరలో రూ.21 వేలకు పెంచనుందని ఊహాగానాలు సాగుతున్నాయి. అదే నిజమైతే… EPFకు ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా పెరుగుతుంది. దాంతో… ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది.
EPF గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. రూ.6,500గా ఉన్న గరిష్ఠ వేతనాన్ని ఏకంగా రూ.15వేలకు పెంచారు. ఆ నిర్ణయం తీసుకుని 8 ఏళ్లు పూర్తికావడంతో… ఇప్పుడు వేతన పరిమితిని మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని… గరిష్ఠ వేతన పరిమితిని కమిటీ సమీక్షించనుంది.
సాధారణంగా EPFకు ఉద్యోగి వాటాగా జీతంలో 12 శాతం, యజమాని వాటాగా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా EPF ఖాతాలో జమ అవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం EPF ఖాతాలో జమవుతాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ వేతన పరిమితి ప్రకారం… 8.33 శాతం కింద రూ.1250 EPS ఖాతాలోకి వెళ్తాయి. మిగతా మొత్తం ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. గరిష్ఠ వేతన పరిమితి పెరిగితే ఆ మేరకు ఉద్యోగి వాటా, యజమాని వాటా కూడా పెరిగి, పెన్షన్ ఖాతాలో ఎక్కువ మొత్తం జమ అవుతుంది.
ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం రూ.30 వేలు ఉంటే… అందులో అతని వాటా రూ.3600 EPF ఖాతాలో జమవుతాయి. యజమాని వాటా కింద రూ.3600 ఉంటాయి. గరిష్ఠ వేతన పరిమితి అయిన.15 వేలను పరిగణనలోకి తీసుకుంటే.. 8.33 శాతం కింద రూ.1250 EPS ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.2350 ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. అంటే నెలకు ఉద్యోగి, యజమాని వాటా కింద EPF ఖాతాలో రూ.5950 ఉంటాయి. గరిష్ఠ పరిమితిని 21వేలు చేస్తే ఆ మేరకు EPSలో జమ అయ్యే మొత్తం దాదాపు రూ.1750కి పెరగనుంది.