Perni Nani Sensational Comments On TDP: మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లిని హత్య చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని అన్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే అధికారులు కూడా వారినే నియమించారని తెలిపారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు.
వైసీపీ నేతలు ఏక పక్షంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదని అన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేయలేదని ఈ నెల 15న ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. మరి 13వ తేదీన ఎందుకు ఫిర్యాదు చేయలేదని టీడీపీని ప్రశ్నించారు. సిట్ అధికారులు డీజీపీకి ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదన్నారు. పిన్నెల్లిపై ఈసీ దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు.
ఈ నెల 12న ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించిందని చెప్పారు. పోలింగ్ ఆగినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్ లో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వివిధ ఛానాళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా అని అన్నారు. నిజంగానే ఎమ్మెల్యే ఈవీఎంలు ధ్వంసం చేస్తే వారు ఈసీ అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు.
Also Read: చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ : సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్
టీడీపీ నేతలు హత్యాయత్నం చేసే వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ఈసీని ప్రశ్నించారు. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పులు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేయాలనే ఆలోచనతోనే పిన్నెల్లి ఇంటి దగ్గర బలగాలను తొలగించారని అనుమానం వ్యక్తం చేశారు. పిన్నెల్లికి హాని జరిగితే ఐజీ, ఎస్పీ, డీజీపీదే బాధ్యత అని హెచ్చరించారు.