25 Hours Time for Tirupati Darshanam: విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటం.. పైగా వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో.. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం త్రాగునీరు, ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకూ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది.
మరోవైపు తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ కమిటీ వెల్లడించింది. బ్రేక్ దర్శనాలకు సైతం భక్తులు పోటెత్తారు. కొండపైకి వెళ్లే ఉచిత బస్సులు రద్దీగా ఉండటంతో.. భక్తులు మెట్ల మార్గంమీదుగా కొండపైకి చేరుకుంటారు. కార్ పార్కింగ్ కూడా ఫుల్ అవ్వడంతో వాహనాలను కొండ కిందే నిలిపివేస్తున్నారు.
Also Read: ఆదివారం హాలిడే అని సరదాగా షాపింగ్కి వెళ్తున్నారా? ఈ వస్తువులను అస్సలు కొనకండి..
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో కొలువై ఉన్న మల్లిఖార్జున స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని సమాచారం. ఉచిత బస్సులు ఫుల్ అవ్వడంతో.. మెట్లమార్గంలో పైకి చేరుకుంటున్నారు.