Update on Remal Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా.. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి.. తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ కు నైరుతి దిశలో సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా.. పశ్చిమ బెంగాల్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. దీనికి రెమాల్ అని నామకరణం చేశారు. రెమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఈ తుపాను ఆదివారం అర్థరాత్రి తర్వాత సాగర్ ద్వీపం – ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ ను ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లపై రేమాల్ తుపాను ప్రభావం చూపనున్నట్లు ఐఎండీ పేర్కొంది. అలాగే ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ – నికోబార్ దీవుల పైనా తుపాను ప్రభావం ఉందని, భారీ వర్షాలు కురవవచ్చని హెచ్చరించింది.
ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం (మే 28) వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్ తీరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Swathi Maliwal: కోర్టులో ఏడ్చిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్
రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.