Who Will in Nellore Assembly Constituency Vijayasai Reddy Vs Vemireddy Reddy: నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుంది..? ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయిన ఇద్దరు పెద్దారెడ్లు పోటీ పడిన సింహపురిలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది. నెల్లూరు జిల్లా వైసీపీతో అయిదేళ్లకు పైగా అనుబంధం కొనసాగించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చివరి నిముషంలో టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. దాంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి నెల్లూరు ఎంపీ స్థానంలో పోటీ చేయించింది. పోలింగ్ ముగిసాక ఇద్దరూ విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు. ఆ క్రమంలో నెల్లూరు ఎంపీగా గెలిచేది ఎవరన్నది హాట్ టాపిక్గా మారింది.
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉంది. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు విజేతని నిర్ణయిస్తారు. ఈ సారి అక్కడ విజయం వైసీపీ, టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు, ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురు ముఖ్యనేతలు ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువగా కొనసాగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షల79 వేల359మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8 లక్షల 23 వేల 699 మంది. మహిళలు 8 లక్షల 55 వేల 476మంది ఉన్నారు.
అయితే ఈ సారి నెల్లూరు లోక్సభ సెగ్మెంట్లో ఎన్నికల అత్యంత కాస్ట్లీగా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది .. ఆర్థిక, అంగ బలం కలిగిన అభ్యర్ధులు ఇక్కడ పోటీ చేయడంతో ఏపీలో నెల్లూరు పార్లమెంటు స్థానం గెలుపుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. హేమా హేమీలు రాజకీయాల్లో తలపండిన నేతలు ఇక్కడ నుంచే చక్రం తిప్పారు.హుందా రాజకీయాలకు పెట్టింది పేరైన నెల్లూరు నుంచి గెలిచిన నేతలు వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి .. రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేశారు. అలాంటి నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ సారి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, విజయసాయిరెడ్డిలు పోటీ పడ్డారు. ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడం.. టీడీపీ, వైసీపీలు నెల్లూరు ఎంపీ స్థానాన్ని ప్రెస్టేజియస్గా తీసుకోవడంతో గెలిచేదెవరనేది ఆసక్తి రేపుతుంది.
Also Read: Amadalavalasa Political Heat: మామ VS అల్లుడు.. మధ్యలో గాంధీ
నెల్లూరు పెద్దారెడ్డి.. సినిమాల్లో తరచు వినిపించే డైలాగ్.. దానికి తగ్గట్లే నెల్లూరు రాజకీయమంతా పెద్దారెడ్ల చుట్టే తిరుగుతుంటుంది. అలాంటి ఇద్దరు పెద్దారెడ్ల మధ్య పోటీ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది. అసలు నెల్లూరు బరిలో విజయసాయిరెడ్డి పోటీ చేస్తారని ఎవరూ అనుకోలేదు. 2028 జూన్ వరకు అంటే ఇంకా నాలుగేళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయంతో పోటీ చేయాల్సి వచ్చింది. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పదవీకాలం గత నెలలోనే ముగిసింది.
వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా 2019 ఎన్నికల్లో చక్రం తిప్పారు వేమిరెడ్డి.. ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ గెలిచింది. ఆ క్రమంలో వైసీపీలో హీరో అయిపోయిన వేమిరెడ్డిని జిల్లా పార్టీ నేతలు ఆరాధ్యదైవంలా కొలిచారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అయితే వేమిరెడ్డి దంపతులను ఆదిదంపతులని బహిరంగంగానే ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలున్నాయి. అలాంటాయన ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో నిలబడ్డారు. వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అధ్యర్ధిగా ఖరారైన వేమిరెడ్డి.. ఎన్నికలకు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. జగన్ నిర్ణయాలతో విసిగిపోయి టీడీపీలో చేరి పోటీచేశారు. తన గెలుపు ఖాయమని.. జిల్లాల్లో పదికి పది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతుందని ముందే ప్రకటించారు.
Also Read: ఆ దెబ్బతో ద్వారంపూడి ఓటమి ఫిక్స్! సేనాని పంతం నెగ్గే!
వేమిరెడ్డి నిర్ణయంతో షాక్ అయిన వైసీపీ.. ఆయన ధీటైన అభ్యర్ధి కోసం వెతికివెతికి చివరికి విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపింది. బడాబాబులైన ఆ ఇద్దరు పెద్దారెడ్ల పోటీతో పోలింగ్ సరళి ఎవరికి సానుకూలంగా మారిందన్న దానిపై రకరకాల విశ్లేషణలు వినిపస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో వెలువడనున్న ఫలితాలపై ఎవరి లెక్కలు వారు వినిపిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు తమను గట్టేకిస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ నవరత్నాలే వారికి ఆశాదీపాలుగా కనిపిస్తున్నాయి.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచి పార్టీ మారారని ప్రచారంలో వైసీపీ నేతలు ఊదర గొట్టారు. అయితే వివాదరహితులుగా పేరున్న వేమిరెడ్డి తమ పార్టీ నుంచే వైసీపీలోకి వెళ్లి.. అవమానాలు ఎదుర్కొని బయటకు వచ్చారని టీడీపీ నేతలు తన కాన్వాసింగ్లో కౌంటర్లు ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో వైసీపీకి కాలం చెల్లిందని అందుకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి బడా నేతలు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు .. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని మంచి చేయడమే గాని చెడు చేయడం తెలియని నేతగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి ఉన్న పేరుతో తమ పార్టీ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.
Also Read: Srikalahasti Politics: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?
మొత్తానికి వేమిరెడ్డి, విజయసాయిలు సర్వశక్తులొడ్డి ప్రచార పర్వాన్ని ముగించారు. వారి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసే వరకు వారు చేయాల్సినవన్నీ చేశారు. ఇద్దరూ కలిసి నెల్లూరు రాజకీయాల్ని అత్యంత కాస్ట్లీగా మార్చేమయడంతో .. ఓటరు తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.