CM Jagan : జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఈ సదస్సు నిర్వహణ కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. డిసెంబర్ 5న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని దేశంలో అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానిస్తోంది.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర నుంచి ఆహ్వానం అందింది. ఏపీ సీఎం జగన్ ను అఖిలపక్ష సమావేశానికి రావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 5 న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న జీ 20 దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహిస్తుంది. భారత్ లో నిర్వహించే జీ20 సమావేశాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందని కేంద్రం. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా జీ20 దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం.