Jabaradasth Emmanuel: సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఉండవు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొంటే తప్ప ఆ సెలబ్రిటీ హోదా దక్కదు. ఎన్నోసార్లు కుటుంబాలను కూడా పక్కన పెట్టి సెట్స్ లోనే షూటింగ్ కోసం ఉండిపోతారు. తాజాగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తన తాత చనిపోయినా కూడా వెళ్లలేని పరిస్థితి అని, ఆయనను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అని ఎమోషనల్ అయ్యాడు.
జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో ఇమ్మాన్యుయేల్ ఒకడు. కలర్ తక్కువ, బట్ట ఉండడంతో తన మీద తానే పంచ్ లు వేసుకొని ఫేమస్ అయ్యాడు. ఇక వర్ష లవ్ ట్రాక్ అతడిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడు షోస్ మాత్రమే కాకుండా సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం గంగం గణేశా. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్మాన్యుయేల్ హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. మే 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూకు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. ” జబర్దస్త్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. స్కిట్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా తాత చనిపోయాడు. ఇంటికి రమ్మని.. స్కిట్ మధ్యలో వదిలేసి వెళ్ళలేను.
నాకు మా తాత అంటే చాలా ఇష్టం. ఏం చేయలేని పరిస్థితి. స్టేజి వెనక్కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి కళ్ల నీళ్లు తుడుచుకొని స్కిట్ చేశాను. ఆ కెరీర్ బెస్ట్ స్కిట్స్ లో అది ఒకటి. ఇక స్కిట్ అయ్యాక ఇంటికి బయల్దేరాను. నేను వెళ్ళేసరికే తాత అంత్యక్రియలు అయిపోయాయి. ఆయన చివరి చూపు కూడా దక్కలేదు” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.